హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): బ్యాంకుల నుంచి భారీ ఎత్తున రుణాలు తీసుకొని మోసానికి పాల్పడిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్(కేఎస్బీఎల్) సంస్థ చైర్మన్ సి.పార్థసారధిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ అంజనీకుమార్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్టాక్ బ్రోకింగ్ నిర్వహించే కేఎస్బీఎల్కు సుమారు 2 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు.
ఇందులో ఆయా కస్టమర్లమకు చెందిన డీమాట్ ఖాతాలను చాలా వరకూ కేఎస్బీఎల్ నిర్వహించేది. ఈ క్రమంలోనే కస్టమర్లకు సంబంధించిన స్టాక్స్ను తమ ఖాతాలోకి బదిలీ చేసుకొని, బదిలీ చేసుకున్న వాటిని ఇండస్ ఇండ్ బ్యాంకులో మార్చి, 2019 నుంచి తనఖా పెడుతూ రూ. 137 కోట్ల రుణం పొందారు. కేఎస్బీఎల్ తీసుకున్న రూ. 137 కోట్ల రుణాన్ని చెల్లించకుండా మొండికేయడంతో ఇటీవల ఇండస్ ఇండ్ బ్యాంక్ సీసీఎస్ పోలీసులకు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టిన ఏసీపీ హరికృష్ణ నేతృత్వంలోని బృందం పార్థసారధిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతానికి పార్థసారధిని అరెస్టుచేయగా, ఇతరులు కూడా ఈ కేసులో ఉన్నారు.
ఇతర ఖాతాల్లోకి రూ. 720 కోట్లు
దర్యాప్తులో నిందితులు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొంది రూ. 720 కోట్లు ఇతర ఖాతాలలోకి మళ్లించినట్లు బయటపడింది. ఇండస్ ఇండ్లానే ఇతర బ్యాంకుల నుంచి కూడా తమ వద్ద ఉన్న కస్టమర్ల షేర్స్ సెక్యూరిటీగా పెట్టి రూ. 680 కోట్లు రుణాలు పొందినట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా తమ వద్ద ఉన్న కస్టమర్ల షేర్లను దుర్వినియోగం చేస్తుండడంతో కార్వీపై 2020లో సెబీ నిషేధం విధించింది.
కేఎస్బీఎల్తో పాటు కార్వీ కమోడిటీస్పై రూ. 347 కోట్ల మోసం చేశారని ఫిర్యాదులు రావడంతో రెండు కేసులు సీసీఎస్ పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో అదనపు సీపీ(క్రైమ్స్) శిఖాగోయెల్, సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి తదితరులు పాల్గొన్నారు.