అందించిన కళ్యాణి రఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్
హైదరాబాద్, మార్చి 16: భారత్కు చెందిన కళ్యాణి గ్రూపు, ఇజ్రాయిల్కు చెందిన రఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కళ్యాణి రఫెల్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్(క్రాస్) ..తన తొలి మధ్యస్థాయి సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్(ఎంఆర్ఎస్ఏఎం)ను దేశీయ భద్రతా దళాలు, వైమానిక దళాలకు అందచేసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా హైదరాబాద్లో ఉన్న యూనిట్లో తయారైన ఎంఆర్ఎస్ఏఎంలను వచ్చే రెండేండ్లకాలంలో వెయ్యి యూనిట్లను సరఫరా చేయనున్నది. రెండేండ్ల క్రితం కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ కిట్స్ను సరఫరా చేయనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునేందుకు వీలుగా వీటిని తయారు చేసి ఇవ్వనున్నది భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఈ సందర్భంగా క్రాస్ సీఈవో రుద్ర జడేజా మాట్లాడుతూ.. నూతన శకానికి ఇది ఆరంభం మాత్రమేనని, సాంకేతిక నైపుణ్యం పరంగా మార్పునకు, రక్షణ ఉత్పత్తుల కోసం ప్రపంచ తయారీ కేంద్రంగా నిలిచే సామర్థ్యానికి ఇది ఓ నమునగా నిలుస్తున్నదన్నారు. కరోనా కారణంగా ఏడాదిక్రితమే సరఫరా చేయాల్సి ఉన్న ఈకిట్స్ను ప్రస్తుతం అందచేస్తున్నట్లు చెప్పారు. అలాగే రఫెల్ అడ్వాన్డ్ డిఫెన్స్ సిస్టమ్ హెడ్ బ్రిగ్ జెన్ మాట్లాడుతూ..దాదాపు మూడు దశాబ్దాలుగా భారత సైన్యానికి నమ్మకమైన భాగస్వామిగా సేవలు అందిస్తున్నామని, మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి మా నిబద్దతకు ప్రతీకగా ఈ మిస్సైల్ కిట్స్ నిలుస్తాయన్నారు. కేవలం దేశీయ సైన్యం కోసం మాత్రమే కేఆర్ఏఎస్ ఉత్పత్తులను నిర్మించడం కాకుండా, ఇదే సమయంలో ఇక్కడి నుంచి ఎగుమతి చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రూ.50 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లో 40 మంది విధులు నిర్వహిస్తున్నారు.