కొవిడ్ వ్యాక్సినేషన్ పాలసీ మీద గణనీయమైన మార్పు చోటుచేసుకున్నది. జూన్ 7వ తేదీ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ఈ మార్పుల గురించి తెలియజేశారు. ఇప్పుడు అమల్లో ఉన్న పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి 25 శాతం, ప్రైవేట్ వ్యక్తులకు 25 శాతం, మిగిలిన 50 శాతం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఈ పాలసీకి బదులుగా కొత్త పాలసీని ప్రధాని నిన్న ప్రకటించారు. ఈ కొత్త పాలసీ ప్రకారం రాష్ర్టాల బాధ్యతను కేంద్రమే స్వీకరిస్తుంది. అంటే తయారైన టీకాలలో 75 శాతం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. మిగిలిన 25 శాతం ప్రైవేట్ రంగం తీసుకోవచ్చు.
ప్రధాని ప్రకటనలో మరో ముఖ్యమైన అంశం ఉంది. ఉచిత టీకాలు ఇవ్వడమనేది 18 నుంచి 44 ఏండ్ల వయసున్న వాళ్లకూ వర్తిస్తుంది. అంతకుముందు ఇది రాష్ర్టాల విచక్షణకు వదిలివేశారు. కొవిడ్ సమస్యల గురించి సుప్రీంకోర్టు తనకు తానుగా చేపట్టిన కేసులో తీవ్రమైన విమర్శ చేసిన తర్వాత ఈ మార్పులతో కూడిన కొత్త పాలసీని ప్రధాని ప్రకటించారు.
డబ్బులు పెట్టి వ్యాక్సినేషన్ తీసుకోవడమనేది ప్రథ మ దృష్టితో చూసినప్పుడు అది ఏకపక్షంగా కన్పిస్తుంది. అందులో ఎలాంటి హేతుబద్ధత కూడా కన్పించడం లేదని సుప్రీంకోర్టు ఆ కేసులో అభిప్రాయపడింది. ఈ విమర్శకు బదులుగా జూన్ 1వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వమే 18 నుంచి 44 ఏండ్ల వయస్సు ఉన్న వ్యక్తులకు ఉచితంగా టీకా ఇచ్చే బాధ్యతను స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంచిన ఈ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు డి.వై.చంద్రచూడ్, ఎల్.నాగేశ్వరరావు, ఎస్.రవీంద్రభట్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం టీకా పాలసీ గురించి ఆందోళనను వ్యక్తపరిచింది. అందులో ముఖ్యమైన అంశాలు రెండు- ప్రైవేట్ తయారీదారుల దగ్గరినుంచి నేరుగా రాష్ర్టాలు వాళ్ళు నిర్దేశించిన ధరలకు కొనడం అనే ద్వంద్వ విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఒకేరకమైన ధర ఏర్పర్చకుండా వేర్వేరు ధరలను వాళ్లు నిర్దేశించడమనేది వివక్షతో కూడుకున్నదని సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణను వ్యక్తపరిచింది. అదేవిధంగా కేంద్ర ఉచిత టీకా ప్రక్రియ నుంచి 18 నుంచి 44 ఏండ్ల వయస్సున్న వాళ్లను తొలగించడం అసంబద్ధమైనది, ఏకపక్షమైనది. ఈ రెండవ వేవ్లో ఎక్కువ బాధితులు వాళ్లే.
సుప్రీంకోర్టు ఇంత ఆందోళనను వ్యక్తపరిచినప్పటికీ కూడా గతవారం వరకు కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదు. ఈ కొత్త పాలసీతో అంతా బాగుంది అన్నట్టు సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు ముందు వాదనలు చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు మరో రెం డు అడుగులు ముందుకువేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ అంశాలు తెలియజేయవలసిందని మే 31వ తేదీన ఆదేశాలు జారీచేసింది. వ్యాక్సినేషన్ కొనుగోలు పూర్తి డేటాను, ఈ పాలసీకి దారితీసిన ఫైల్ నోటింగ్స్, అదేవిధంగా వ్యాక్సినేషన్ కొనుగోలు కోసం కేటాయించిన 35,000 కోట్ల రూపాయలని ఏ విధంగా ఉపయోగించారు, వాటిని 18 నుంచి 44 ఏండ్ల వయస్సున్న వ్యక్తులకు ఎందుకు ఉపయోగించడం లేదనే అంశాలపై వివరాలు కావాలని సుప్రీంకోర్టు మే 31న జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
సుప్రీంకోర్టు లేవనెత్తిన చాలా అంశాలకు జవాబులు ఇచ్చే ప్రయత్నం ప్రధాని చేశారు. కొన్నింటిని దాటవేశారు. అందులో ముఖ్యమైనవి- చాలా రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు టెండర్లు పిలిచాయి.
విదేశీ ఉత్పత్తిదారుల దగ్గర నుంచి టీకాల కొనుగోలు కోసం ప్రయ త్నం చేశాయి. కానీ అవి విఫలమయ్యాయి. ఎందుకంటే విదేశీ ఉత్పత్తిదారులు రాష్ర్టాలతో, కేంద్రపాలిత ప్రాంతా ల అధికారులతో నేరుగా మాట్లాడటానికి ఇష్టపడలేదు. అవి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటానికే ఇష్టపడ్డాయి. దీనికి జవాబుగా రాష్ర్టాలు కొనాల్సిన 25 శాతం వ్యాక్సిన్లని కూడా కేంద్ర ప్రభుత్వమే కొని రాష్ర్టాలకు అందజేస్తుందని ప్రధాని తన సంభాషణలో పేర్కొన్నారు. ప్రైవేట్ దవాఖానలు వ్యాక్సిన్లను కొని అత్యంత ఎక్కువ ధరలకు టీకాలని ఇచ్చే అవకాశం ఉందని సుప్రీంకోర్టు ఆందోళనను వ్యక్తపరిచింది. దీనికి జవాబుగా ప్రైవేట్ దవాఖాన యాజమాన్యాలు సర్వీస్ ఛార్జీలు రూ.150 మాత్రమే స్వీకరిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.
మన దేశంలో చాలామందికి ఇంటర్నెట్ సౌకర్యం లేదని, ఉన్నా ఎలా ఉపయోగించుకోవాలో తెలియదని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తపరిచింది. ఈ విషయానికి జవాబు ప్రధాని సందేశంలో లభించలేదు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎప్పటివరకు అయిపోతుందన్న సుప్రీంకోర్టు ప్రశ్నకు కూడా ప్రధాని జవాబు చెప్పలేదు. సుప్రీం కోర్టు ఈ కేసులో దేశ పౌరుల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దానివల్ల కొంతమేరకు ఫలితాలు కన్పిస్తున్నాయి. న్యాయమూర్తుల మౌఖిక పరిశీలనలు ఉత్తర్వులుగా దారితీశాయి.
(వ్యాసకర్త: విశ్రాంత జిల్లా న్యాయమూర్తి, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యులు)
–మంగారి రాజేందర్