న్యూఢిల్లీ : 2022లో ఇంజనీరింగ్ పూర్తయ్యే విద్యార్ధుల కోసం టెక్ దిగ్గజాలు భారీగా నియామకాలు చేపట్టనున్నాయి. పలు కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లను రెట్టింపు చేసేందుకు కసరత్తు సాగిస్తున్నాయి. వలసల రేటు పెరగడం, డిజిటలీకరణ వేగవంతం కావడంతో పెద్దసంఖ్యలో ఫ్రెషర్స్ను నియమించుకోవాలని కంపెనీలు యోచిస్తున్నాయి.
గోల్డ్మన్ శాక్స్, పీడబ్ల్యూసీ, టీసీఎస్, బైజూస్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ వంటి పలు దేశీ, బహుళజాతి కంపెనీలు క్యాంపస్, క్యాంపసేతర నియామకాల్లో ఫ్రెషర్స్ హైరింగ్కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. 2021లో 30,000 మంది ఫ్రెషర్స్ను రిక్రూట్ చేసుకున్న కాగ్నిజెంట్ 2022లో గ్రాడ్యుయేట్లకు 45,000 జాబ్ ఆఫర్లను ఇచ్చేందుకు సిద్ధమైంది.
పీడబ్ల్యూసీ ఈ ఏడాది హైరింగ్ రెట్టింపు చేయనుండగా, గోల్డ్మన్ శాక్స్, ఇన్ఫోసిస్ కూడా గత ఏడాది కంటే అధికంగా ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్కు మొగ్గుచూపుతున్నాయి. డిమాండ్ ఊపందుకోవడంతో ఐటీ, ఐటీయేతర సంస్ధలతో పాటు స్టార్టప్లు, ఆర్ధిక సేవల దిగ్గజాలు సైతం పెద్దసంఖ్యలో నియామకాలు చేపట్టేందుకు సన్నద్ధమయ్యాయి.