న్యూఢిల్లీ: సెర్చింజన్ గూగుల్తో కలిసి జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్ను విపణిలోకి రానున్నది. చౌక ధరకు ఆప్టిమైజ్డ్ వర్షన్ ఆండ్రాయిడ్తో సిద్ధం అవుతున్నది ఈ ఫోన్. రిలయన్స్ 2జీ ఫీచర్ ఫోన్ వాడుతున్న యూజర్లు 4జీ వర్షన్కు అప్గ్రేడ్ చేసే లక్ష్యంతో రూపుదిద్దుకుంటున్నది జియో ఫోన్ నెక్ట్స్. గురువారం రిలయన్స్ 44వ వార్షిక సమావేశంలో సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ సంగతి ప్రకటించారు.
గతేడాది జియో ప్లాట్ఫామ్స్లో పెట్టుబడుల ఒప్పందం కుదిరిన వేళ గూగుల్-రిలయన్స్ జియో భాగస్వామ్యంతో న్యూ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వస్తుందని ముకేశ్ అంబానీ, గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్ ఈ సంగతిని వెల్లడించారు.
భారత్లో జియో ఫోన్ నెక్ట్స్ ఫోన్ ధర ఎంత అన్న సంగతి బహిర్గతం చేయలేదు. అయితే, గణేశ్ చతుర్థి సందర్భంగా సెప్టెంబర్ 10న మార్కెట్లో లభ్యం అవుతుంది.
గూగుల్ అందజేసే లైట్ వర్షన్ ఆండ్రాయిడ్ ఓఎస్తో రిలయన్స్ జియో ఫోన్ నెక్ట్స్ మార్కెట్లోకి రానున్నది. ఈ ఫోన్ కోసం ఆండ్రాయిడ్ ఓఎస్లో మా రెండు టీమ్లు ఆప్టిమైడ్ వర్షన్ కలిగి ఉన్నాయని గూగుల్-ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచ్చాయ్ చెప్పారు.
ఆండ్రాయిడ్ ఓఎస్తో మార్కెట్లోకి రానున్న రిలయన్స్ తొలి మొబైల్ ఫోన్ ఇది. ఇంతకుముందు రిలయన్స్ ఆవిష్కరించిన జియో ఫోన్లు కాయి ఓస్ (KaiOS)తో పని చేశాయి.
జియో ఫోన్ నెక్ట్స్ బాటం అండ్ టాప్ పార్ట్ల్లో థిక్ బెజెల్స్తో ఐదంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిజైన్ 2012 నాటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను పోలి ఉంటుంది. వై-ఫై, బ్లూటూత్ ఫీచర్ల మద్దతుతో ఫ్రంట్లో ఎల్ఈడీ ఫ్లాష్ సెల్పీ కెమెరా, బ్యాక్ సింగిల్ కెమెరా ఉండే చాన్స్ ఉంది.
జియో ఫోన్ నెక్ట్స్ స్మార్ట్ ఫోన్కు గూగుల్ తన లేటెస్ట్ ఆండ్రాయిడ్ రిలీజ్లు, సెక్యూరిటీ అప్డేట్స్ మద్దతునందిస్తుంది. గూగుల్ ప్లే ప్రొటెక్ట్తో ముందస్తుగా ఈ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ లోడ్ చేస్తారు.
జియో యాప్స్తో ఫోన్ యూజర్లు గూగుల్ అసిస్టెంట్ సేవలను ఉపయోగించుకోవచ్చు. తాజా క్రికెట్ స్కోర్, వాతావరణం అప్డేట్ తదితర వివరాలు తెలుసుకోవచ్చు. జియో సావన్పై మ్యూజిక్ ప్లే చేయాలని గూగుల్ అసిస్టెంట్ను కోరొచ్చు. మై జియోలో ఫోన్ బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసుకోవచ్చు.