ముంబై: ఈ నెల 24న రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక సర్వసభ్య సమావేశం జరగబోతోంది. ఈ సందర్భంగా ఆ సంస్థ నుంచి కొన్ని ముఖ్యమైన ప్రకటనలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలోనే జియో 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసే సూచనలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 5జీ స్మార్ట్ఫోన్ల కంటే దీని ధర చాలా తక్కువ అని తెలుస్తోంది. ఈ 5జీ ఫోన్తో మార్కెట్లో 4జీ స్మార్ట్ఫోన్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక ఇదే ఈవెంట్లో అందుబాటు ధరలో ల్యాప్టాప్ను కూడా జియో లాంచ్ చేయనుంది. జియో 5జీ స్మార్ట్ఫోన్ను గూగుల్తో కలిసి జియో తయారు చేస్తోంది. తమ సంస్థలో 7.7 శాతం వాటాను రూ.33,737 కోట్లు పెట్టి గూగుల్ కొనుగోలు చేసినట్లు గతేడాది సమావేశంలోనే ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఈ కొత్త 5జీ ఫోన్తో జియోఓఎస్ అనే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అందుబాటులోకి రానుంది.