న్యూఢిల్లీ, ఆగస్టు 20: బంగారు నగలపై హాల్మార్క్ తప్పనిసరిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సోమవారం ఆభరణాల వర్తకులు ఒకరోజు నిరసనలకు దిగనున్నారు. ఈ మేరకు శుక్రవారం అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి (జీజేసీ) తెలిపింది. రత్నాలు, ఆభరణాల పరిశ్రమలోని మొత్తం నాలుగు జోన్లకు చెందిన 350 సంఘాలు, సమాఖ్యలు తమ ఈ స్ట్రైక్కు మద్దతునిస్తున్నారని ఓ ప్రకటనలో జీజేసీ పేర్కొన్నది. ఈ ఏడాది జూన్ 16 నుంచి దశలవారీ గోల్డ్ హాల్మార్కింగ్ అమలును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్రం తెచ్చిన ఈ హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (హెచ్యూఐడీ)తో ఒరిగిదేమీ లేదని నగల వ్యాపారులు అంటున్నారు. పైగా హాల్మార్కింగ్ కేంద్రాలు రోజుకు దాదాపు 2 లక్షల నగలపైనే హాల్మార్క్ను ముద్రించగలవని, దీంతో ఈ ఏడాదిలో ఉత్పత్తయ్యే నగలకు హాల్మార్క్ జరగాలంటే 3-4 ఏండ్ల సమయం పట్టవచ్చని జ్య్రుయెల్లర్స్ ప్రతినిధి మినావాలా చెప్పారు. దేశంలో ఏటా 10-12 కోట్ల ఆభరణాలు తయారవుతాయని గుర్తుచేశారు. కాబట్టి హాల్మార్క్ను తప్పనిసరి చేస్తే వ్యాపారం దెబ్బతింటుందని, ఇప్పటికే కరోనా పరిస్థితులతో తీవ్రంగా నష్టపోయామని, కాబట్టి ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు.