ముంబై, జూన్ 22: జెట్ విమానాలు మళ్లీ ఆకాశంలో తిరిగే రోజులు వస్తున్నాయ్. రెండు దశాబ్దాలకుపైగా విహరించి, దివాళా తీసిన జెట్ ఎయిర్వేస్కు మంగళవారం పెద్ద ఊరట లభించింది. కంపెనీ పునరుద్ధరణకు వీలుగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) రుణ పరిష్కార ప్రణాళిక అమలుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ఎయిర్లైన్కు చెందిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ అశీష్ మాట్లాడుతూ విమానయాన రంగంలోనే ఇది పెద్ద టర్న్ఎరౌండ్ సంఘటనగా అభివర్ణించారు. ప్రణాళిక అనుకున్నవిధంగా సాగితే ఈ సంవత్సరాంతానికల్లా జెట్ విమానాలు తిరిగి ఆకాశంలో ఎగురుతాయన్నారు. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు రూ.8000 కోట్ల రుణ చెల్లింపుల్లో డిఫాల్ట్అయ్యి, 2019లో జెట్ దివాళా తీసింది. దివాళా చట్టం కింద రెండు సంవత్సరాలుగా జెట్ ఎయిర్వేస్ పరిష్కార ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కంపెనీని పునరుద్ధరించేందుకు బ్రిటన్కు చెందిన కాల్రోక్ క్యాపిటల్, అరబ్ ఎమిరేట్స్కు చెందిన వాణిజ్యవేత్త మురారిలాల్ జలాన్ల కన్సార్షియం 2020 అక్టోబర్లో ఒక రుణ పరిష్కార ప్రణాళికను సమర్పించగా, కంపెనీ రుణదాతల కమిటీ అందుకు అంగీకారం తెలిపింది. తాజా గా ఆ ప్రణాళిక అమలుకు ఎన్సీఎల్టీ ఆమోదముద్రవేసింది. రుణ పరిష్కార ప్రణాళికను వచ్చే 90 రోజుల్లోగా అమలుచేయాలని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్..కన్సార్షియంను ఆదేశించింది.
జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాల పునరుద్ధరణకు ఆయా విమానాశ్రయాల్లో ఈ విమానాల్ని నిలపడానికి స్లాట్స్ కీలకమని రిజల్యూషన్ ప్రొఫెషనల్ ఎన్సీఎల్టీకి నివేదించారు. ఈ అంశంపై తాము ఎటువంటి ఆదేశాలివ్వమని, ప్రభుత్వం లేదా సంబంధిత నియంత్రణా సంస్థ పరిష్కరించాల్సివుంటుందని ఎన్సీఎల్టీ బెంచ్ తెలిపింది. 2019 ఏప్రిల్లో జెట్ తన కార్యకలాపాల్ని నిలిపివేసిన తర్వాత స్లాట్స్ను ఇతర విమానయాన సంస్థలకు కేటాయించారు. జెట్ 25 సంవత్సరాలపాటు విమానాలు నడిపిందనే చరిత్ర ఆధారంగా స్లాట్స్ కేటాయించడం కుదరదంటూ ఇంతకుమునుపే పౌరవిమానయాన డైరెక్టర్ జనరల్, విమానయాన మంత్రిత్వ శాఖలు ఎన్సీఎల్టీకి తెలిపాయి. 1993లో ఎయిర్ట్యాక్సీ ఆపరేటరుగా కార్యకలాపాలు ప్రారంభించిన జెట్&లీజుకు తీసుకున్న నాలుగు బోయింగ్ 737 విమానాలతో విమానయాన సంస్థగా ఎదిగింది.