ముంబై, జూన్ 23: టాటా.. నమ్మకానికి మారు పేరు. హెయిర్ పిన్ను దగ్గర్నుంచి ఏరోప్లేన్ వరకు, సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్దాకా అన్ని రంగాల్లో వ్యాపారాలు చేస్తున్న దిగ్గజ సంస్థ. పారిశ్రామిక రంగంలో భారత్ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత కూడా టాటా గ్రూప్దే అంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అలాంటి టాటాలు.. సంపాదనలోనే కాదు దాతృత్వంలోనూ తమకు సరిలేరు ఎవ్వరని రుజువు చేస్తున్నారు. ప్రపంచంలోనే దానధర్మాల్లో టాటాలను మించినవారు లేరని తాజాగా హురున్ నివేదిక, ఎడిల్గీవ్ ఫౌండేషన్లు తేల్చాయి మరి. టాప్-50తో తయారైన జాబితాలో గడిచిన వందేండ్లలో జంషెట్జి టాటా ఏకంగా రూ.7,55,820 కోట్ల (102 బిలియన్ డాలర్లు) విరాళాలు ఇచ్చారని స్పష్టమైంది. 1892 నుంచే విద్య, ఆరోగ్య రంగాలకు ట్రస్టుల ద్వారా విరాళాలు ఇస్తూ వచ్చారు. కాగా, టాటా తర్వాత బిల్గేట్స్, ఆయన మాజీ భార్య మిలిందాలు ఇప్పటిదాకా 74.6 బిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు.
ఈ టాప్-50 ప్రపంచ దాతల జాబితాలో భారత్ నుంచి జంషెట్జి టాటా తర్వాత విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీకే స్థానం దక్కింది. ఆయన తన మొత్తం సంపద 22 బిలియన్ డాలర్లను దాతృత్వ సేవలకు ఇచ్చేశారు.
టాటా మోటర్స్ ఎండీ, సీఈవో గ్యుంటర్ బుషెక్ ఈ నెల 30న ఆ హోదాల నుంచి దిగిపోనున్నారు. ఈ మేరకు బుధవారం సంస్థ తెలియజేసింది. కాగా, వచ్చే ఏడాది మార్చి ఆఖరుదాకా కంపెనీకి బుషెక్ కన్సల్టెంట్గా ఉంటారని టాటా మోటర్స్ స్పష్టం చేసింది.