న్యూఢిల్లీ, మార్చి 23: లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) తనదైన శైలిలో గర్జించింది. 2025 సంవత్సరం నాటికి విద్యుత్తో నడిచే కార్లను మాత్రమే తయారుచేసే బ్రాండ్గా ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కంపెనీ తన తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీ ‘జాగ్వార్ ఐ-పేస్’ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. కేవలం 4.8 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకోగలగడం దీని ప్రత్యేకత. మూడు వేరియంట్లలో లభ్యమయ్యే ఈ కారు ప్రారంభ ధరను రూ.1.06 కోట్లుగా నిర్ణయించింది. 90 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని కలిగి ఉండే జాగ్వార్ ఐ-పేస్.. 294 కిలోవాట్ల శక్తిని, 696 న్యూటన్ మీటర్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. జాగ్వార్ ఐ-పేస్ కొనుగోలుదార్లకు కారుతో పాటు చార్జింగ్ కేబుల్ను, 7.4 కేడబ్ల్యూ ఏసీ వాల్-మౌంటెడ్ చార్జర్ను అందజేయనున్నట్లు జేఎల్ఆర్ తెలిపింది.
స్వాగతించిన బెంజ్
ఇదిలావుంటే, వ్యాపారంలో జేఎల్ఆర్కు ప్రధాన పోటీదారుల్లో ఒకటైన మెర్సిడెజ్ బెంజ్ కంపెనీ.. మార్కెట్లోకి జాగ్వార్ ఐ-పేస్ రాకను స్వాగతించింది. అంతేకాకుండా మెర్సిడెజ్ బెంజ్ చార్జింగ్ స్టేషన్లలో జాగ్వార్ ఐ-పేస్ కార్లను చార్జింగ్ చేసుకునేందుకు వాటి యజమానులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నది. ఈ ప్రకటనపై జేఎల్ఆర్ హర్షం వ్యక్తం చేసింది. మెర్సిడెజ్ బెంజ్కు కృతజ్ఞతలు తెలిపింది.