హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి, వారి జీవితాల్లో గుణాత్మక మార్పును రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో దళిత మేధావివర్గం కదిలిరావాలని పిలుపునిచ్చారు. రూ.1200 కోట్లతో ప్రారంభించి, రానున్న కాలంలో రూ.40 వేల కోట్లతో అమలు చేయబోతున్న ‘సీఎం దళిత సాధికారత పథకం’ కోసం పటిష్ఠమైన కార్యాచరణను రూపొందిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా భవిష్యత్తులో కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అందుకు తగిన సూచనలు, సలహాలు అందించాలని మేధావులను కోరారు. సీఎం దళిత సాధికారత పథకాన్ని రూ.1200 కోట్లతో ప్రకటించినందుకు, మరియమ్మ లాకప్డెత్ విషయంలో తక్షణమే స్పందించి దళితుల ఆత్మ సె్థైర్యాన్ని పెంచినందుకు.. సోమవారం పలువురు దళిత మేధావులు, ప్రొఫెసర్లు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దళిత సమాజాన్ని పేదరికం నుంచి బయటపడేసేందుకు ఎంతైనా చేయడానికి ప్రభుత్వం నిబద్ధతతో కృషిచేస్తున్నదన్నారు.
దళారులు లేకుండా నేరుగా సహాయం
రాష్ట్రంలో ఒక్కో రంగాన్ని చక్కదిద్దుకొంటూ వస్తున్నామని.. సాగునీరు, వ్యవసాయం సహా గ్రామీణ ఆర్థిక వ్యవస్థపే పటిష్ఠం చేసుకొన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేయడం ద్వారా అందరి జీవితాలతోపాటు దళితుల జీవితాలు కూడా మెరుగుపడుతూ వస్తున్నాయని పేర్కొన్నారు. ‘దళితుల కోసం ఇంకా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. సామాజికంగా, ఆర్థికంగా శతాబ్దాల కాలంగా వివక్షకు గురవుతూ వస్తున్న దళిత సమాజం గురించి ప్రత్యేక శ్రద్ధపెట్టి బాగుచేసుకోవాల్సిన అవసరమున్నది. బాధ్యత కలిగిన ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్రంలోని దళితుల్లో పేదరికం అనేదే లేకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవడానికి రానున్నకాలంలో ఈ పథకం ద్వారా 40 వేల కోట్ల రూపాయలను ఖర్చుచేయబోతున్నం. దీనికి తోడుగా భవిష్యత్తులో కార్పస్ఫండ్ను ఏర్పాటు చేయబోతున్నం. మధ్య దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారునికే ఆర్థిక సాయం అందించాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నం. ఈ నేపథ్యంలో దళిత మేధావివర్గంగా ప్రొఫెసర్లు, ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులు.. అందరూ ఈ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలి. దళిత సమాజంలో ఏం జరుగుతున్నది? ఇంకా ఏమి చేయాలి? ఎట్లచేస్తే అట్టడుగున ఉన్న కడు పేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చునో మీ సలహాలు, సూచనలను అందించండి. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా డే లాంగ్ వర్షాప్ను నిర్వహించుకుందాం.. దళిత సాధికారతను సాధించి దేశానికి ఆదర్శంగా నిలుద్దాం’ అని సీఎం కేసీఆర్ దళిత మేధావులకు తెలిపారు.
సపోర్టింగ్ మెకానిజం తయారు
దళితుల సామాజిక ఆర్థిక సమస్యలను దేనికదిగానే లోతుగా విశ్లేషించి, క్యాటగిరీలవారీగా సమస్యలను విభజించి వారికి సీఎం దళిత సాధికారత పథకం ద్వారా సాయం అందించే కార్యాచరణ చేపట్టబోతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. పథకాన్ని రూపొందించడమే కాకుండా దాన్ని పటిష్ఠంగా అమలుచేయడానికి కావాల్సిన సపోర్టివ్ మెకానిజాన్ని మనమే తయారుచేసుకోవాలని అన్నారు. ఏ రంగంలోనైనా అభివృద్ధి జరగాలంటే అందుకోసం రెండు రకాల ఇన్పుట్స్ అవసరమని తెలిపారు. అందులో ఒకటి ఆర్థ్ధికపరమైనది కాగా రెండోది ఆలోచనపరమైనదని, రెండు ఇన్పుట్స్ను కలగలిపి దళితుల అభివృద్ధికోసం సమిష్టి కృషిని సాగిద్దామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
పటిష్ఠంగా పథకాన్ని రూపొందిస్తే..
ఈ పథకాన్ని పటిష్ఠంగా రూపకల్పన చేస్తే సగం విజయం సాధించినట్లవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఆశించిన ఫలితాలను రాబట్టే క్రమంలో ఈ పథకాన్ని పటిష్ఠంగా రూపకల్పనచేయడమే ప్రధానమని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా, అన్ని పార్టీల దళిత ప్రజాప్రతినిధులతో పదిన్నరగంటలపాటు చర్చ జరిగిందని, ఆ చర్చలో అనేక సలహాలు, సూచనలను వారు అందించారని సీఎం తెలిపారు. ఇంకా వివిధ వర్గాలతో మరికొన్ని సమావేశాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా సమస్యలు
దళితుల సమస్యలు ఒకతీరుగా లేవని.. వారి జీవన పరిస్థితులను బట్టి, గ్రామాల్లో ఒక రకంగా.. పట్టణాల్లో మరో రకంగా ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘సెమీ అర్బన్లో ఒక తీరు సమస్యలుంటే, కార్పొరేషన్ స్థాయిలో మరో తీరుగా ఉన్నాయి. హైదరాబాద్ వంటి కాస్మొపాలిటన్ నగరాల్లోనయితే పూర్తి భిన్నంగా దళితుల సమస్యలున్నాయి. వీటిని మేధావులు అర్థంచేసుకొని, ఏ ప్రాంతంలోని సమస్యలకు ఏ విధమైన విధానాన్ని అనుసరించడం ద్వారా శాశ్వత పరిషారాలను సాధించగలమో ఆలోచనచేయాల్సిన అవసరమున్నది. దళిత సాధికారత పథకాన్ని అమలు చేసుకోవడం ద్వారా ఆ కష్టాలను ఏవిధంగా అధిగమించి ఫలితాలను సాధించగలమో కూలంకషంగా చర్చించుకోవాల్సిన అవసరమున్నది’ అని సీఎం కేసీఆర్ చెప్పారు.
సీఎంకు దళితమేధావుల ధన్యవాదాలు
తెలంగాణ దళిత సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపేంచేందుకు సీఎం కేసీఆర్ ప్రకటించిన ‘సీఎం దళిత సాధికారత పథకం’ దళితుల పాలిట వరమని, వారి జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకనున్నదని దళిత మేధావులు పేర్కొన్నారు. అందుకు సీఎం కేసీఆర్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. సోమవారం ప్రగతిభవన్లో సీఎంను కలిసిన సందర్భంగా మేధావులు భాగోద్వేగంతో స్పందించారు. రాష్ట్ర ఆర్థికభారాన్ని లెకచేయకుండా, అణగారిన తమ జాతి అభివృద్ధి కోసం, కమిట్మెంట్తో ఉదార స్వభావంతో సీఎం కేసీఆర్ కార్యాచరణ చేపట్టడం హర్షణీయమని ఎస్సీ ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం తెలంగాణశాఖ నేతలు తెలిపారు. ఇటీవల మరియమ్మ లాకప్డెత్ విషయంలో సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి వారి కుటుంబాన్ని నిలబెట్టడంతోపాటు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ మరియమ్మ చావుకు కారణమైన పోలీసులను ఉద్యోగంలోంచి సస్పెండ్చేయడం, నేరం నిరూపణ అయితే ఉద్యోగం లోంచి శాశ్వతంగా తొలగిస్తామని చెప్పటం గొప్ప విషయమని కొనియాడారు. సీఎం చర్య ద్వారా దళిత సమాజంలో ఒక భరోసా ఉప్పెనలా పొంగిందని వారు తెలిపారు. ప్రత్యేకంగా బాధితులను పరామర్శించడానికి డీజీపీని పంపించడంతో తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టినట్టయిందన్నారు. ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం’ అమలుకు వర్క్షాపు నిర్వహించి, దళిత మేధావి వర్గాన్ని ఆహ్వానించడాన్ని అభినందిస్తున్నామని దళిత మేధావులు అన్నారు. సీఎం కేసీఆర్ను కలిసినవారిలో ఎస్సీ, ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు ఆరేపల్లి రాజేందర్, ప్రొఫెసర్ మురళీదర్శన్, ఓయూ ప్రొఫెసర్ మల్లేశం, మాదిగ విద్యావంతుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీ, ఎస్టీ నాన్ టీచింగ్ స్టాఫ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బీ కుమార్, బంధు సొసైటీ అధ్యక్షుడు పుల్లెల వీరస్వామి, మాదిగ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు డాక్టర్ జాన్, మేధావులు సీబీ ప్రసాద్, బీ కుమార్, నాగరాజు, జాన్ సుందర్ రాజ్, వాణి, మెర్సీ, డాక్టర్ సుందర్రావు, ఏ సుధార్త్, రాజేందర్, డాక్టర్ ప్రీతమ్, కే కృష్ణ, డాక్టర్ తిరుపతి, డాక్టర్ మల్లికార్జున్, రాజేందర్, డాక్టర్ చంద్రయ్య, డాక్టర్ వంశీ, జీ రమేశ్బాబు తదితరులున్నారు.
మిన్నంటిన ‘దళిత’ సంబురం
దళితోద్ధరణపై హర్షాతిరేకాలు
కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
‘సీఎం దళిత సాధికారత పథకం’పై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సామాజిక, ఆర్థిక బాధల నుంచి దళితులకు విముక్తి కల్పించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తొలుత నియోజకవర్గానికి వంద కుటుంబాలకు, ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించి తమలో ఆత్మైస్థెర్యాన్ని నింపారని కొనియాడుతున్నారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు జరుపుకొన్నారు. కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మణుగూరులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఇల్లెందు మండలం బాలాజీనగర్లో ఎమ్మెల్యే హరిప్రియానాయక్ దళిత సంఘాల నాయకులతో కలిసి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. హు జూరాబాద్ అంబేదర్ చౌరస్తాలో పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, దళిత నాయకులు.. ‘జై కేసీఆర్, జైజై కేసీఆర్’ అంటూ నినదించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ రావు, టీఆర్ఎస్ నాయకులు బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, నల్లగొండలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తదితరులు సంబురాల్లో పాల్గొన్నారు.