న్యూఢిల్లీ: వేతన జీవులు, వ్యాపారులు, వివిధ వర్గాలు ఆదాయం పన్ను చెల్లించడానికి ప్రతియేటా ఐటీ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడం సర్వ సాధారణం. పన్ను చెల్లింపు దారుల సౌకర్యార్థం ఈ ఏడాది ఐటీ శాఖ ప్రారంభించిన న్యూ టాక్స్ ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఐటీ శాఖ మాన్యువల్గా ఐటీఆర్ దాఖలు చేసేందుకు అనుమతించింది.
ఈ మేరకు ఐటీ శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ నెలాఖరు వరకు బ్యాంకుల్లో మాన్యువల్గా ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి అనుమతినిస్తున్నట్లు ఆ సర్క్యులర్లో పేర్కొంది. విదేశాల నుంచి వచ్చే చెల్లింపులకు ఫామ్ 15సీఏ/15సీబీ సమర్పించాలి.
ఈ నెలాఖరు వరకు జరిగే విదేశీ చెల్లింపులపై ఆథరైజ్డ్ డీలర్లు 15సీఏ/15సీబీ ఫామ్ స్వీకరించాలని ఐటీ శాఖ సూచించింది. ఈ ఫామ్లు తదుపరి ఈ-ఫైలింగ్ పోర్టల్లో అప్లోడ్ చేయొచ్చునని పేర్కొంది.
www.Incometax.Gov.In పోర్టల్లో ఆదాయం పన్ను ఫామ్స్ 15సీఏ /15సీబీ సమర్పించడంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక ఈ నెలాఖరు వరకు టాక్స్ పేయర్స్ మాన్యువల్గా సమర్పించేందుకు అనుమతించాం అని ఐటీ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
కొన్ని ప్రత్యేక కేసుల్లో 15సీఏ ఫామ్తోపాటు చార్టర్డ్ అకౌంటెంట్ సర్టిఫికెట్ గల 15సీబీ ఫామ్ కూడా స్వీకరిస్తారు.