హైదరాబాద్, సెప్టెంబర్ 6: ఐటీ సేవల సంస్థ అనలెక్ట్ ఇండియా.. హైదరాబాద్లో తమ కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇప్పటికే గురుగ్రామ్, బెంగళూరుల్లో ఆఫీస్లు ఉండగా.. తాజాగా భాగ్యనగరంలో తన మూడో ఆఫీస్ను ఆరంభించింది. దేశవ్యాప్తంగా టెక్నాలజీ, మీడియా సర్వీసులు, మార్కెటింగ్, క్రియోటివ్ విభాగాల్లో తమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను విస్తరించే వ్యూహంలో భాగంగా ఈ సెంటర్ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మూడు సెంటర్లలో 800 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా.. వచ్చే ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను వెయ్యికి పెంచుకోవాలని చూస్తున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా అధ్యక్షుడు విశాల్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఆఫీస్ మా తదుపరి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఐటీ ప్రధాన కేంద్రంగా మారనున్నదనడంలో అతిశయోక్తి లేదన్నారు. ప్రస్తుతం ఈ సెంటర్లో 40 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, భవిష్యత్తులో ఈ సంఖ్యను వందకి పెంచుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.