న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడుతున్నా ఈ ఏడాది ఐటీ రంగంలో నియామకాల ఊపుతో వైట్ కాలర్ జాబ్ మార్కెట్ లో ఉత్తేజం నెలకొంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మే మాసం చివరి రెండు వారాల్లో ఐటీ నియామకాలు పెరిగాయని ఎక్స్ఫెనో సహ వ్యవస్ధాపకులు కమల్ కారంత్ పేర్కొన్నారు. ఐటీ రంగం ఈ ఏడాది భారీ హైరింగ్ చేపడుతుందని, నియామకాల్లో జోరుకు ఐటీ రంగం సారథ్యం వహిస్తుందని కారంత్ అంచనా వేశారు.
రాబోయే 12 నెలల్లో ప్రతి నెలా ఐటీ రంగంలో 30,000 నూతన నియామకాలు ఉంటాయని తాము అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు. లాక్ డౌన్ లు ఎదురైనా హైరింగ్ ప్రక్రియ కు అవరోధం ఉండదని పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే రికవరీ ఎలా జరుగుతుందన్నది ఆయా కంపెనీలు గుర్తిస్తున్నాయని అన్నారు. సాంకేతిక రంగానికి సరిహద్దులు ఉండకపోయినా వైట్ కాలర్ ఐటీ ఉద్యోగాల్లో ప్రముఖ నగరాలే కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు.
ఐటీ నియామకాల్లో బెంగళూర్, హైదరాబాద్, ముంబై, పుణే, ఢిల్లీలు ముందువరసలో ఉన్నాయని కారంత్ వెల్లడించారు. ఐటీయేతర ఉద్యోగాలు మాత్రం ఐటీ కొలువుల తరహాలో వేగంగా అందుబాటులోకి రావడం లేదని కారంత్ అన్నారు.