న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరాని (2020-21)కిగాను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ( IT Returns ) దాఖలు చేసే గడువును పెంచే అవకాశాలు ఉన్నాయి. రెండున్నర నెలల కిందట కొత్తగా ప్రారంభమైన www.incometax.gov.in సైట్లో ఇప్పటికీ అవాంతరాలు ఎదురవుతుండటంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) గడువు తేదీని పొడిగించే అవకాశాలు ఉన్నట్లు ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐటీ రిటర్న్స్ దాఖలుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకూ సమయం ఉంది.
అయితే చాలా మంది యూజర్లు సోషల్ మీడియా వేదికగా ఈ వెబ్సైట్ పనితీరుపై ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ఈ సైట్ను అభివృద్ధి చేసిన ఇన్ఫోసిస్ వివరణను ప్రభుత్వం కోరింది. ఈ కొత్త సైట్లో ఈ ఆధునిక కాలానికి తగినట్లు ఐటీ రిటర్న్స్ దాఖలు, రీఫండ్లు సులువుగా జరిగేలా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. అయితే మొదటి నుంచీ ఏదో ఒక సాంకేతిక సమస్య ఎదురవుతూనే ఉంది.