న్యూఢిల్లీ: ఒకప్పుడు వజ్రాల వ్యాపారులే తమ ఉద్యోగులకు ఖరీదైన.. విలాసవంతమైన కార్లు, ఇండ్లు గిఫ్ట్లుగా ఇచ్చేవారు.. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఈ బాట పట్టాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి నియంత్రణ లక్ష్యంగా లాక్డౌన్లు విధించడంతో వర్క్ ఫ్రం హోం.. లెర్నింగ్ ఫ్రం హోం వల్ల డిజిటలైజేషన్కు డిమాండ్ పెరిగింది. ఐటీ సంస్థల బిజినెస్ ఊపందుకుంటున్నది.
క్లౌడ్ కంప్యూటింగ్.. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) .. డేటా అనలిటిక్స్ రంగాల్లో పట్టున్న టెక్కీలకు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి దేశీయ ఐటీ దిగ్గజాలు. రకరకాల ఆఫర్లు ఇస్తున్నాయి. మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఐదేండ్ల నుంచి ఏడేండ్ల వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే రూ.40-50 లక్షల వేతన ప్యాకేజీకి డిమాండ్ చేస్తున్నారు.
అతిపెద్ద కంపెనీల నుంచి సాధారణ సంస్థల వరకూ అన్నింటిది ఇదే తీరు.. అవసరాలకు సరిపడా నిపుణుల్లేక ఐటీ సంస్థలు ఫ్రెషర్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఫలితంగా ఇండియన్ ఐటీ రంగంలో ఉద్యోగాల వర్షం కురుస్తున్నది. దీనికితోడు ఇప్పటికే వివిధ సంస్థల్లో పని చేస్తున్న వారు రాజీనామా చేసి, మెరుగైన అవకాశాల కోసం ఇతర సంస్థల్లో చేరిపోతున్నారు. నిపుణుల వలసలు లేదా ( Attrition ) నిష్క్రమణలను నివారించడానికి ఐటీ సంస్థలు పోటీ పడుతున్నాయి.
ఇక ప్రతి ఐటీ సంస్థ తన ప్రత్యర్థి సంస్థలోని మెరికల్లాంటి నిపుణులను ఆకర్షిస్తోంది. ఆఫర్ల వర్షం కురిపిస్తున్నది. కొన్నేండ్ల పాటు ఐటీ రంగంలో బహుళ జాబ్స్ నిర్వహించిన అనుభవం గల ఉద్యోగులకు బోనస్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఫిన్టెక్ దిగ్గజం భారత్పే కొత్తగా చేరేవారి కోసం బీఎండబ్ల్యూ బైక్లు ఆఫర్ చేస్తోంది.
ఇతర సంస్థలు.. టెక్ దిగ్గజం ఆపిల్ వారి ఐ-ఫోన్లు బహుమతులుగా అందజేస్తున్నాయి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ హవర్స్ వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఇంటర్వ్యూలకు హాజరై అసెస్మెంట్ టెస్ట్ రాసిన ప్రతి అభ్యర్థి చేరినా, చేరకున్నా.. రూ.1000 నుంచి రూ.5000 చెల్లిస్తున్నాయి.
డిజిటలైజేషన్కు డిమాండ్ పెరగడంతో రిక్రూట్మెంట్ సంస్థలూ బాగానే సంపాదిస్తున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుందామన్న చందంగా ఓవర్టైం పని చేస్తున్నాయి. సంబంధిత నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఒక సంస్థ ఆఫర్పై సంప్రదింపులు చేస్తున్నప్పుడే మరో సంస్థ నుంచి ఆఫర్ వస్తోంది. ఒక్కోసారి తాము పని చేసిన సంస్థ నుంచే ఆ ఆఫర్ రావడంతో సదరు నిపుణులు వెనక్కి వెళ్లిపోతున్నారు.
ప్రతి వారం వెయ్యికి పైగా ఇంటర్వ్యూలు షెడ్యూల్ అవుతున్నాయని టాలెంట్ కన్సల్టెంట్ సంస్థ హన్ డిజిటల్ వ్యవస్థాపకుడు-సీఈవో శరవణన్ బాలసుందరం పేర్కొన్నారు. కానీ వాటిలో 40 శాతం అభ్యర్థుల్లో ఆసక్తి లేకపోవడం.. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేక పోవడంతో ఇంటర్వ్యూ రద్దు కావడం గానీ, వాయిదా పడటం గానీ జరుగుతున్నది. 600 ఇంటర్వ్యూలో జరిగితే కేవలం 75 మంది మాత్రమే ఉద్యోగాల్లో చేరుతున్నారని అన్నారు.
ఏప్రిల్తో ముగిసిన త్రైమాసికం నాటికి ఐటీ సంస్థల్లో ఐదు వేల మంది ఫ్రెషర్స్ కోసం డిమాండ్ ఉండేది. జూన్ త్రైమాసికం ముగిసే నాటికి అది 20 వేలకు చేరుకుందని టీం లీజ్ డిజిటల్ ఉపాధ్యక్షుడు-బిజినెస్ హెడ్ శివ ప్రసాద్ నందూరి చెప్పారు.
టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్, విప్రో సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష మందిని నియమించుకోవాలని భావిస్తున్నాయి. ఇక అమెరికా సంస్థ కాగ్నిజెంట్ 30 వేల మంది ఫ్రెషర్స్తోపాటు లక్ష మంది అనుభవజ్ఞులను నియమించుకోవాలని ప్రణాళిక రూపొందించుకుంది. వచ్చే ఏడాది జరిగే క్యాంపస్ సెలక్షన్లలో 45 వేల మందికి ఆఫర్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. గత మూడు త్రైమాసికాల్లో టాలెంటెడ్ నిపుణుల కోసం డిమాండ్ పెరిగిందని ఫస్ట్ మెరిడియన్ బిజినెస్ సర్వీసెస్ సీఈవో అనురాగ్ గుప్తా చెప్పారు.