హైదరాబాద్ : కరోనా మహమ్మారి ఎంతో మంది కొలువులకు ఎసరు పెట్టింది. ఆ వైరస్ వ్యాప్తితో మరికొంత మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. ప్రత్యేకంగా కార్పొరేట్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. పలు సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడమే కాకుండా, జీతాలను కూడా తగ్గించాయి. దీంతో ఆ ఉద్యోగుల జీవితాలు, కుటుంబాలు అతలాకుతలమయ్యాయి.
ఇప్పుడిప్పుడే కరోనా తీవ్రత తగ్గడంతో కుదేలుపడ్డ కార్పొరేట్ రంగం మళ్లీ పుంజుకుంటోంది. ప్రత్యేకంగా ఐటీ కంపెనీలు నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు మంచి ఆఫర్లు ఇస్తోంది. నైపుణ్యం కలిగిన టెక్నికల్ ప్రొఫెషనల్స్కు భారీ జీతాలు ఇచ్చేందుకు రెడీగా ఉంది. అప్లికేషన్ డెవలపర్, లీడ్ కన్సల్టెంట్, సేల్స్ఫోర్స్ డెవలపర్, సైట్ రిలయబిలిటీ ఇంజినీర్లకు 150 నుంచి 300 శాతం డిమాండ్ పెరిగింది. ఈ ఉద్యోగులకు 120 శాతం జీతాలు పెంచేందుకు ఐటీ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి.
కరోనా మహమ్మారి సంభవించిన మొదట్లో ఐటీ కంపెనీలల్లో 50 శాతం నియామకాలు తగ్గాయి. ఉద్యోగులు అవసరం ఉన్నప్పటికీ రిక్రూట్మెంట్ చేసుకునేందుకు కూడా కొన్ని కంపెనీలు వెనుకంజ వేశాయి. సాంకేతిక పెరగడంతో ఉన్న సిబ్బందితోనే లాక్డౌన్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి.
ప్రస్తుతం ఐటీ నిపుణుల డిమాండ్ 400 శాతం పెరిగినట్లు జాబ్ సెర్చ్ పోర్టల్ ఇన్డీడ్ ఇండియా నివేదికలో వెల్లడైంది. నైపుణ్యం కలిగిన టెక్నికల్ ప్రొఫెషనల్స్తో పాటు అప్లికేషన్ డెవలపర్, లీడ్ కన్సల్టెంట్, సేల్స్ఫోర్స్ డెవలపర్, సైట్ రిలయబిలిటీ ఇంజినీర్లకు 2020, జనవరి నుంచి 2021, ఫిబ్రవరి 2021 వరకు 150 నుంచి 300 శాతం డిమాండ్ పెరిగినట్లు తేలింది.
గతేడాదితో పోల్చితే.. ఈ ఏడాది తమ ఉద్యోగుల పనికి కొత్త ప్రతిభను జోడించడమే కాకుండా, అధిక జీతాలను అందిస్తున్నాయి. ఫుల్ స్టాక్ ఇంజినీర్లకు ఐటీ కంపెనీలు 70 నుంచి 120 శాతం వరకు జీతాలను హైక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇన్డీడ్ ఇండియా రిపోర్టులో వెల్లడైంది.
ఇండియాలో ప్రముఖమైన ఐటీ కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు జీతాలు పెంచడమే కాకుండా, భారీగా రిక్రూట్మెంట్ చేపట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వుమెన్ ప్రొఫెషనల్స్కు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు భారీ రిక్రూట్మెంట్ చేపడుతామని టీసీఎస్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఫైనాన్షియల్ ఇయర్ 22లో మొత్తం ఐటీ సెక్టార్ వేతన బిల్లు 1.6 నుంచి 1.7 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది.