న్యూఢిల్లీ : కార్పొరేట్ రంగంలో ముఖ్యంగా ఐటీలో ఉద్యోగుల వలసల రేటు అత్యధికంగా ఉండటంతో నైపుణ్యాలు కలిగిన టెకీలను కాపాడుకునేందుకు కంపెనీలు టాప్ పెర్ఫామర్స్కు నజరానాలు ప్రకటిస్తున్నాయి. క్వార్టర్లీ ప్రమోషన్లు, ప్రత్యేక వేతన పెంపులు, ఎక్కడి నుంచైనా పనిచేసే వెసులుబాటు, ఉన్నత విద్య కోసం ప్రోత్సహకాలు వంటి పలు ఆఫర్లతో ఉద్యోగులను ఆకట్టుకుంటున్నాయి.
కాగ్నిజెంట్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, టాటా స్టీల్, ఆర్పీజీ గ్రూప్, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు కీలక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులను నిలబెట్టుకునేందుకు వారికి అనూహ్యమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. ఈ ఏడాది భారత్లో 66 శాతం మంది ఉద్యోగులు తాము ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగం నుంచి మార్పు కోరుతున్నారని మైక్రోసాఫ్ట్ చేపట్టిన సర్వే నివేదిక పేర్కొంది. భారత్లో ఈ ఏడాది అన్ని రంగాల్లోనూ సగటున ఉద్యోగుల నిష్క్రమణ రేటు దశాబ్ధంలోనే గరిష్టంగా 20 శాతం ఉందని ఏఒన్ ఇండియా వేతన పెంపు సర్వే సైతం వెల్లడించింది.
ఉద్యోగుల వలసలను నిరోధించేందుకు పుణేకు చెందిన పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వార్షిక వేతన పెంపులతో పాటు ఆయా ప్రాజెక్టులకు కీలకమైన ఉద్యోగుల వేతనాల్లో మార్పులు చేపట్టేందుకు టీం లీడర్స్ కోసం వార్షిక కోటా కింద కొంత మొత్తాన్ని కేటాయించినట్టు చెబుతున్నారు. కీలక ప్రాజెక్టుల్లో నైపుణ్యాలతో కూడిన ఉద్యోగులను నిలబెట్టుకునేందుకు వారికి అదనపు బోనస్ను అందిస్తున్నామని పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వర్గాలు వెల్లడించాయి.