2020-21లో 50.58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
సంక్షోభంలోనూసత్తా చాటిన సంస్థ
గోదావరిఖని, ఏప్రిల్ 1 : సింగరేణి సంస్థ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 72 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. 70.35 మిలియన్ టన్నుల లక్ష్యానికి 50.58 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కరోనా సంక్షోభం చుట్టు ముట్టినా నిలదొక్కుకొని ఇంత ఉత్పత్తి సాధించడం విశేషం. గతేడాది ఏప్రిల్లో లాక్ డౌన్ ఉండడం, తర్వాత కరోనా పరిస్థితులు ఉండడంతో అసలు ఈ ఆర్థిక సంవత్సరం సగమైనా బొగ్గు ఉత్పత్తి సాధిస్తుందా? లేదా అన్న అనుమానం తలెత్తాయి. అయితే, క్రమంగా కరోనా తీవ్రత తగ్గడంతో సంస్థ బొగ్గు ఉత్పత్తి పెంచుకుంటూ ముందుకు సాగింది. ఎట్టకేలకు 50 మిలియన్ టన్నులకు పైగా ఉత్పత్తి సాధించడంతో సంస్థ ఊపిరి పోసుకుంది. ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల్లో 97,50,000 టన్నులకు 45,14,802 టన్నులు మాత్రమే సాధించింది. ఓసీపీల్లో 6,06,00,000 టన్నులకు 4,60,65,514 టన్నులు ఉత్పత్తి చేసింది. నిర్దేశించిన లక్ష్యాలను కేవలం రామగుండం డివిజన్-3 మాత్రమే సాధించింది. ఇందులో 65 లక్షల టన్నులకు 68 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తితో 105 శాతం సాధించింది. మిగతా, ఏ ఏరియాల్లో ఉత్పత్తి లక్ష్యం సాధ్యం కాలేదు. సింగరేణి సంస్థ 2019-20 ఆర్థిక సంవత్సరంలో 64 మిలియన్ల బొగ్గు ఉత్పత్తి సాధిస్తే, ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 13.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయింది.