హైదరాబాద్ : తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్కు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. మంత్రి కేటీఆర్ ట్వీట్కు ఎమ్మెల్యే కిశోర్ వెంటనే స్పందించి ఓ కుటుంబానికి అండగా నిలిచారు.
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని జాజిరెడ్డిగూడెం మండలం చాకలిగూడెం గ్రామానికి చెందిన దర్శనం సతీష్ ప్రమాదవశాత్తు కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సతీష్కు భార్య శిల్ప, పిల్లలు అక్షిత(5), లాస్య(4), బేబీ( 8 నెలలు) ఉన్నారు. శిల్పను ఆదుకోవాలని కోరుతూ మహమ్మద్ ఇమ్రాన్ అనే నెటిజన్ మంత్రి కేటీఆర్ దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకొచ్చారు.
తక్షణమే స్పందించిన కేటీఆర్.. వారి కుటుంబానికి అండగా ఉండాలంటూ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్కు మంత్రి సూచించారు. కేటీఆర్ ట్వీట్కు ఎమ్మెల్యే వెంటనే స్పందించి శిల్ప కుటుంబానికి అండగా నిలిచారు. ముగ్గురు చిన్నారుల పేర్ల మీద బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసి ఒక్కొక్కరి మీద రూ.50,000 చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. తక్షణ సాయం కింద రూ. 50,000 అందజేశారు. అలాగే దర్శనం శిల్పకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, పిల్లల చదువుల కోసం గురుకుల పాఠశాలలో చేర్పించి, ఉండడానికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానని ఎమ్మెల్యే కిశోర్ భరోసానిచ్చారు. పిల్లలకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.