కన్నూ మిన్ను కానకుండా అతివేగంగా వాహనం నడిపి ఓ కష్టజీవిని బలితీసుకున్నాడో ఆడి కారు యజమాని. నిర్లక్ష్యంగా, అతి వేగంగా వెనకాల నుంచి దూసుకువచ్చిన ఓ ఆడి కారు.. ఆటోను ఢీకొట్టడంతో అందులో కూర్చున్న ప్రయాణికుడు అమాంతంగా గాల్లోకి ఓ 8 ఫీట్ల వరకు ఎగిరి ఫుట్పాత్ మీదపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన గురించి సమాచారం అందినప్పుడు ఇది సాధారణ ప్రమాదంగా భావించారు. సీసీ కెమెరాలు, ఆటోడ్రైవర్ అందించిన వివరాలను పరిశీలించినప్పుడు పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. దర్యాప్తులో కారు వేగం 100 కిలో మీటర్ల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ వేగం సాధారణంగా మద్యం సేవించిన తర్వాతనే చోటు చేసుకుంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఆడి-ఏ8 కారు ఉప్పల్కు చెందిన రఘునందన్రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉందని పోలీసులు గుర్తించారు. కారును నడిపించిన వ్యక్తి ప్రమాదం జరగగానే కారును అక్కడనే వదిలేసి పారిపోయాడు.
సిటీబ్యూరో/మాదాపూర్, జూన్ 27(నమస్తే తెలంగాణ): బేగంపేట్కు చెందిన ఉమేశ్కుమార్ గచ్చిబౌలి ప్రిజమ్ పబ్లో కెప్టెన్గా పని చేస్తున్నాడు. వీకెండ్ కావడంతో రెండు రోజుల పాటు పబ్లో ఉన్న ఉమేశ్కుమార్ ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో బేగంపేట్ పాటిగడ్డలో ఉన్న తన ఇంటికి ఉబర్ ఆటోను బుక్ చేసుకుని బయలుదేరాడు. ఇన్ఆర్బిట్ మాల్ హైహోం అబ్రార్ రోడ్డు వద్దకు రాగానే.. వెనకాల నుంచి అతివేగంగా వచ్చిన ఆడి కారు(టీఎస్ 08 ఎఫ్డీ 9293) ఆటోను ఢీకొట్టింది. ఒక్కసారిగా ఉమేశ్కుమార్ ఆటో నుంచి దాదాపు 8 అడుగుల ఎత్తులో ఎగిరి.. ఫుట్పాత్ మీద పడ్డా డు. తలకు తీవ్రగాయమై స్పాట్లోనే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ హ్యాండిల్ను పట్టుకుని ఉండటంతో అతను ఆటోలోనే ఉండిపోయి స్వల్పగాయాలయ్యాయి. ఈ సంఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. మూడు ప్రత్యేక టీంలను రంగంలోకి దించారు. అయితే..ఈ వాహనాన్ని సృజన్ నడిపించినట్లు ప్రాథమికంగా మాదాపూర్ పోలీసులు ఆధారాలు సేకరించారు.