కోల్కతా: పశ్చిమబెంగాల్లో మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వమే ఉంటుందని, మీకందరికి ఉచితంగా రేషన్ అందజేసే కార్యక్రమం ఎప్పటిలాగే కొనసాగుతుందని ఓటర్లను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. ఇక నుంచి రేషన్ సరుకుల కోసం ప్రజలు చౌక దుకాణాల ముందు లైన్లో నిలబడాల్సిన అవసరం లేదని, మే నెల నుంచి లబ్ధిదారుల ఇండ్ల వద్దకే రేషన్ కోటా వస్తుందని ఆమె హామీ ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ టీఎంసీ శ్రేణులు పురూలియాలో ఏర్పాటు చేసిన బహరంగ సభలో మమతాబెనర్జి ప్రసంగించారు. అయితే, ఇటీవల కారు డోర్ తగలడంతో గాయపడ్డ ఆమె వీల్ చైర్లో కూర్చునే ప్రచారం నిర్వహిస్తున్నారు. పురూలియా సభలో కూడా మమత వీల్చైర్లో కూర్చునే ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు మరోసారి కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే ఆశీర్వించాలని ఆమె కోరారు.