గత రెండు మూడు వారాలుగా ప్రభుత్వ ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతున్నాయి. ఈ సమయంలోనూ డాలర్ మరింత బలపడుతుండటంతో ఈక్విటీ మార్కెట్లు, బంగారం, వెండి ధరలు దిగువకు పడిపోతున్నాయి. ఎందుకిలా జరుగుతున్నది. సాధారణంగా బాండ్ల రాబడులు, డాలర్ విలువతో ఈక్విటీ, కమోడిటీ మార్కెట్లకు విలోమ సంబంధం ఉంటుంది. అంటే బాండ్ రాబడులు పెరిగే కొద్దీ ఈక్విటీ మార్కెట్లు పతనం అవుతాయి. ఈ విలోమ సంబంధానికి ప్రధానంగా సంస్థాగత పెట్టుబడులు కారణం. మ్యూచువల్ ఫండ్లు, పెన్షన్ ఫండ్లు, ఇతర సంస్థాగత ఇన్వెస్టర్లు ఎక్కడ రాబడి అక్కడే మదుపు చేసి తద్వారా అధిక లాభాలను చూపించడం పరిపాటి. ఇప్పుడు జరుగుతున్నది ఈ క్రమమే. ఈక్విటీ మార్కెట్లు గత ఏడాది కాలంలో రెట్టింపు కాగా, గత రెండేండ్లలో బంగారం రెట్టింపు అయింది. ఈ సమయంలో బాండ్లపై రాబడులు తగ్గాయి. డాలర్ ఇండెక్స్ రెండేండ్ల కనీస స్థాయికి పడిపోయింది. ఇప్పుడు బాండ్ రాబడులు పెరుగడం వల్ల ఈక్విటీల్లోనూ, బంగారంలోనూ లాభాలను స్వీకరించడానికి వాటిని అమ్మేసి, వచ్చే నిధులను బాండ్లలో పెట్టుబడులు పెడుతున్నారు. షేర్లలో లాభాలను స్వీకరించండి. కొత్త మదుపులో సెలక్టివ్గా ఎంచుకొండి. ఎస్ఐపీలను మాత్రం కొనసాగించండి. కొత్తగా బాండ్ ఫండ్లలో మదుపు చేయండి లేదా హైబ్రిడ్ ఫండ్లలో మదుపు చేయండి తద్వారా రిస్క్ తక్కువగా వుండే రాబడులను పొందవచ్చు.