Invester Wealth | దేశీయ స్టాక్ మార్కెట్లలో `బేరిష్` ధోరణి కనిపిస్తున్నది. కీలక వడ్డీరేట్లు 75 బేసిక్ పాయింట్లు పెంచుతూ అమెరికా ఫెడ్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయంతో గత మూడు సెషన్లలో (బుధ, గురు, శుక్ర వారం) ఇటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్, అటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ రెండు శాతం నష్టపోయాయి. మూడు రోజుల్లో సెన్సెక్స్ 1620.8 పాయింట్లు పతనమైంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6.8 లక్షల కోట్లు నష్టపోయి రూ.276.6 లక్షల కోట్లకు పడిపోయింది. శుక్రవారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 1,137.8 పాయింట్లు పతనమైంది.
ఫలితంగా ఈ ఏడాది దేశీయ స్టాక్మార్కెట్లలో ఇన్వెస్టర్లు సంపాదించిన లాభాలన్నీ వదులుకున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల స్క్రిప్ట్లన్నీ నష్టపోయాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కెనరా బ్యాంక్ షేర్లు ఐదు శాతానికి పైగా పతనమయ్యాయి. మీడియా, రియాల్టీ షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్సియల్ సర్వీసెస్ స్క్రిప్ట్లు కూడా సుమారు మూడు శాతం నష్టపోయాయి.
పరిస్థితులు కుదుటపడే వరకు ఇన్వెస్టర్లు వేచి ఉండాలని జియోజిట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ రీసెర్చ్ వినోద్ నాయర్ సూచించారు. వృద్ధిరేటును ప్రోత్సహించడానికి, ధరలను కట్టడి చేయడానికి వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు ద్రవ్య పరపతి సమీక్షలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. అయినా భారత్లో పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. రుణ పరపతి వృద్ధి చెందుతున్నదని, పన్ను వసూళ్లు పుంజుకున్నాయని చెప్పారు.
మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ రూ.80.98కి పడిపోయింది. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. తులం బంగారం ధర రూ.462, కిలో వెండి ధర రూ.1243 తగ్గాయి.