న్యూఢిల్లీ: కుటుంబానికి భరోసానిచ్చేది బీమా… పాలసీదారుడికి ఏమైనా అయితే క్లయిమ్లు ( Insurance claims ) దాఖలు చేయడంపై తేడాలు ఉన్నాయి. మీరు ఒక బీమా పాలసీ తీసుకుంటే అది మీ ఆస్తి.. అలా మీ వారసులకు దానిపై హక్కులుంటాయి.. కానీ పాలసీ ప్రారంభించే టైంలోనే నామినీ పేరు చేరుస్తారు. కనుక క్లయిమ్స్ దాఖలు చేసే విషయంలో వారసుల కంటే నామినీకే ముందు హక్కు ఉంటుంది. ఈ నిబంధనను బీమా సవరణ చట్టం-2015లో చేర్చింది కేంద్రం.
నామినీగా వీరిని చేర్చొచ్చు..
కనుక ఒక వ్యక్తి చేసే జీవిత బీమా పాలసీపై నామినీకే తొలుత హక్కులు లభిస్తాయి. పాలసీదారు తన నామినీగా తల్లిదండ్రులు.. జీవిత భాగస్వామి.. పిల్లలను చేర్చవచ్చు. అటువంటప్పుడు ఆ పాలసీపై వచ్చే ఆదాయం పాలసీదారు పేర్కొన్న నామినీలకే దక్కుతుంది. చట్టపరమైన వారసులు క్లయిమ్ చేసుకునేందుకు వీల్లేదు.
వారసుడు ఇలా క్లెయిమ్స్ చేయొచ్చు..
అయితే, నామినీ లేకుంటే మాత్రం చట్టపరమైన వారసుడు బీమా మొత్తం క్లెయిమ్ చేయొచ్చు. దీనికోసం క్లెయిమ్ ఇంటిమేషన్ లెటర్, మరణ ధ్రువీకరణ పత్రం, లబ్ధిదారుడి ఐడీ ప్రూఫ్, పాలసీ పేపర్లు, తాను ఆ పాలసీదారుడికి చట్టపరమైన వారసుడినని తెలిపే ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
వారసుల్లో ఒకరిని నామినీ చేస్తే ఇవీ సమస్యలు..
వారసులు ఒకరి కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకరు మాత్రమే క్లయిమ్ చేస్తే మిగతా వారు సంబంధిత బీమా సంస్థకు సమ్మతి పత్రం సమర్పించాలి. పాలసీదారు తన పిల్లల్లో ఒకరినే నామినేట్ చేస్తే.. ఆ వ్యక్తికే బెనిఫిట్లు లభిస్తాయి. మిగతా వారు న్యాయ పోరాటం చేయడానికి ఆస్కారం ఉంటుంది.