సిబ్బందికి వేతనాలు పెంచిన సంస్థ
న్యూఢిల్లీ, జూన్ 19: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్తను అందించింది. సిబ్బంది వేతనాలను మరోమారు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ పెంపు జూలై నుంచి అమలులోకి రానున్నట్లు ఒక ప్రకటనలలో వెల్లడించింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఇలా వేతనాలు పెంచడం ఇది రెండోసారి. వలసలను తగ్గించడానికి, నైపుణ్యం కలిగిన సిబ్బందిని తిరిగి రప్పించడానికి సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది తొలి నెల జనవరిలోనే సంస్థ జీతాలు పెంచిన విషయం తెలిసిందే. శనివారం కంపెనీ 40వ వార్షికోత్సవ సాధారణ సమావేశంలో కంపెనీ సీవోవో ప్రవీణ్ రావు మాట్లాడుతూ..ఐటీ సేవలకు డిమాండ్ నెలకొనడంతో భారీ స్థాయిలో సిబ్బందిని నియమించుకోనున్నట్లు, గతేడాదితో పోలిస్తే వలసలు అధికంగా ఉండటం కూడా మరో కారణమని వెల్లడించారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు 20 వేల మంది గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. ఇప్పటికే విప్రో 80 శాతం మంది సిబ్బంది వేతనాలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు వచ్చే సెప్టెంబర్ నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. అలాగే టీసీఎస్ కూడా ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చేలా వేతనాలు పెంచిన విషయం విధితమే. మరోవైపు, కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ మాట్లాడుతూ… అతిపెద్ద కంపెనీలను కొనుగోలు చేసే ఉద్దేశం సంస్థకు లేదని, డిజిటల్ విభాగంలో ఉన్న చిన్న సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.