న్యూఢిల్లీ, ఆగస్టు 12: తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల తోడ్పాటుతో దేశ పారిశ్రామికోత్పత్తి వరుసగా రెండోనెలలో వృద్ధిచెందింది. ఈ ఏడాది జూన్ నెలలో గతేడాది ఇదేనెలతో పోలిస్తే పరిశ్రమల ఉత్పత్తి 13.6 శాతం వృద్ధిచెందింది. 2020 జూన్లో కరోనా సంక్షోభంతో 16.6 శాతం క్షీణించిన కారణంగా లో బేస్ ఎఫెక్ట్తో ఈ జూన్లో వృద్ధి సాధ్యపడింది. 2021 మే నెలలో ఈ వృద్ధి 28.6 శాతం. పారిశ్రామికోత్పత్తి సూచి (ఐఐపీ) 2020 జూన్లో 107.9 పాయింట్లుకాగా, తాజాగా ముగిసిన జూన్ నెలలో 122.6 పాయింట్లు. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ జూన్లో ఇండెక్స్లో అధిక వెయిటేజి కలిగిన తయారీ రంగం ఉత్పత్తి 13 శాతం పెరిగింది. మైనింగ్ రంగం 23.1 శాతం, విద్యుదుత్పత్తి 8.3 శాతం చొప్పున వృద్ధిచెందాయి. తయారీ రంగంలో ఉప విభాగాలైన క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 25.7 శాతం పెరగ్గా, కన్జూమర్ డ్యూరబుల్స్ తయారీ 30.1 శాతం పెరిగింది. కన్జూమర్ నాన్-డ్యూరబుల్స్ ఉత్పత్తి మాత్రం 4.5 శాతం క్షీణించింది. కొవిడ్ సెకండ్వేవ్ సందర్భంగా పలు రాష్ర్టాల్లో విధించిన లాక్డౌన్లు జూన్ నెలలో క్రమేపీ సడలించడంతో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయని ఎన్ఎస్ఓ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
దిగొచ్చిన ఆహార ధరలు
ఆహార పదార్థాల ధరలు శాంతించాయి. వరుసగా రెండు నెలలుగా పెరుగుతూ వచ్చిన ఆహార పదార్థాలు తగ్గుముఖం పట్టడంతో జూలై నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల కనిష్ఠ స్థాయి 5.59 శాతానికి చేరుకున్నది. జూన్లో 6.26 శాతంగా ఉన్న ధరల సూచీ ఏడాది క్రితం ఇదే నెలలో 6.73 శాతంగా ఉన్నది. గత నెలలో ఆహార పదార్థాల ధరల సూచీ 5.15 శాతం నుంచి 3.96 శాతానికి తగ్గినట్లు కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడించింది. కూరగాయల ధరలు మైనస్ 7.75 శాతానికి పడిపోగా, పప్పుదినుసులు 9.04 శాతానికి దిగొచ్చాయి. కానీ, మాంసం, చేపలు, కోడిగుడ్లు, పాల ధరల సూచీ మాత్రం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉం టుందని ఆర్బీఐ అంచనా.