కరోనా వైరస్తో ఉక్కిరి బిక్కిరవుతూ ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి వైద్యులు, ఇతర సిబ్బందే దేవుళ్లయ్యారు. వైరస్కు గురైన వారి వద్దకు వెళ్లేందుకు వైద్యులే జంకుతున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో, వరంగల్ ఎంజీఎంలో పర్యటించారు. భయపడాల్సిన పనేమీలేదని అభయమిచ్చారు. ముఖానికి మాస్కు మాత్రమే పెట్టుకుని కేసీఆర్.. గాంధీ, ఎంజీఎంలోని అన్ని వార్డుల్లో పర్యటించి అక్కడ చికిత్స పొందుతున్న వారిని పేరుపేరునా పలుకరించి వారికి తానున్నాననే భరోసా కల్పించారు.
ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా పేరుగాంచిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ఎలా కరోనా రోగుల కోసం పాటుపడుతున్నారనేది చర్చనీయాంశంగా తయారైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి మహామహులు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూపీలో మొత్తం 80 మంది ఎంపీలు ఉండగా.. వారిలో ప్రధాని నరేంద్ర మోదీ (వారణాసి), కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ (రాయ్బరేలి) , ములాయంసింగ్ యాదవ్ (మెయిన్పురి), హేమా మాలిని (మధుర), రాజ్నాథ్సింగ్ (లక్నో), స్మృతి ఇరాని (అమేథి), అఖిలేష్ యాదవ్ ( ఆజామ్గఢ్), ఆజాంఖాన్ (రాంపూర్), అతుల్ రాయ్ (ఘోసీ), సంతోష్ గంగ్వార్ ( బరేలి), జనరల్ వీకే సింగ్ ( ఘజియాబాద్), మేనకాగాంధీ (సుల్తాన్పూర్), వరుణ్గాంధీ (ఫిల్బిత్) వంటి ప్రముఖులు ఉన్నారు.
దేశ ప్రజలకు ఇబ్బంది పెడుతున్న ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఈ ప్రముఖ ఎంపీలంతా ఏం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎలాంటి సేవలు అందిస్తున్నారనే విషయాన్ని కనుగొనేందుకు ఒక హిందీ దినపత్రిక సర్వే చేపట్టింది. ఈ సమయంలో కూడా దాదాపు 62 మంది ఎంపీలు తమ నియోజకవర్గం ప్రజలకు కనిపించకుండా పోయారని తేలింది. వీరిలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు కూడా ఉన్నారు. గత కొన్నిరోజులుగా తమ నియోజకవర్గాలకు ఈ ప్రముఖులంతా దూరంగా ఉన్నారంట.
వారణాసి నుంచి ప్రాతానిధ్యం వహిస్తున్నా ప్రధాని నరేంద్ర మోదీ చివరిసారిగా తన నియోజకవర్గాన్ని 6 నెలల క్రితం 2020 నవంబర్ 30 న సందర్శించారు. ఈలోగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా 7 సార్లు వారణాసి అధికారులు, వైద్యులు, కరోనా వారియర్స్, విద్యార్థులు, సామాన్య ప్రజలతో సంభాషించారు. ప్రధాని మోదీ పార్లమెంటరీ వ్యవహారాలను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఎంఎల్సీ ఏకే శర్మ నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ రాజధానిలోనే ఉండి వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అక్కడి నుంచే ఆయన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆదేశాలిస్తున్నారు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయ్ బరేలీకి చెందిన ఎంపీ. ఎన్నికల్లో గెలిచిన తరువాత 2020 జనవరి 22 న ఆమె చివరిసారిగా తన నియోజకవర్గానికి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె రాయ్బరేలీ ముఖం చూడక 16 నెలలు అయ్యింది. ఆమె ప్రతినిధి కెఎల్ శర్మ సోనియా పనులన్నీ చూస్తున్నారు. ప్రియాంక గాంధీ కూడా చివరిసారిగా 2020 సెప్టెంబర్ 30 న రాయ్ బరేలీకి వచ్చారు.
మెయిన్పురి నుంచి ఎంపీ అయిన ములాయం సింగ్ యాదవ్ చివరిసారిగా 2019 ఏప్రిల్ 19 న తన పార్లమెంటరీ నియోజకవర్గమైన మెయిన్పురికి వచ్చారు. అది కూడా బీఎస్పీ అధినేత మాయావతితో కలిసి ప్రచారం నిర్వహించేందుకే వచ్చారు. అంటే, ములాయం తన పార్లమెంటరీ నియోజకవర్గాన్ని 25 నెలలుగా సందర్శించలేదు.
ఈ నెల 11 న రాజ్నాథ్ సింగ్ తన నియోజకవర్గం లక్నోలో పర్యటించారు. తన పరిధిలో ఉన్న డీఆర్డీఓ ఆధ్వర్యంలో 718 బెడ్లతో ప్రత్యేక కొవిడ్ దవాఖాన ఏర్పాటు చేశారు. రెండు దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు.
కరోనా సమయంలో మధుర ఎంపీ, సినీ నటి హేమా మాలిని తన ప్రాంతంలో చాలా తక్కువగా పర్యటించారు. మురారి బాపు ఉపన్యాస కథలో మార్చి 25 న ఆమె చివరిసారిగా ఇక్కడకు వచ్చారు. ఆమె మార్చి 28 వరకు మధురలో ఉన్నారు. అప్పటి నుంచి ఆమె మధురకు వెళ్ళలేదు. మే మొదటి వారంలో ఆమె కనిపించడం లేదంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో మే 18 న ముంబై నుంచి ఒక వీడియోను విడుదల చేసి ప్రతి ఒక్కరు టీకాలు తీసుకోవాలని, లాక్డౌన్ పాటించాలని సూచించారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ నెల 7 న తన నియోజకవర్గం అయిన అమేథిలో పర్యటించారు. ఇంతవరకు తన నియోజకవర్గంలోని ఒక్క దవాఖానను కూడా సందర్శించలేదు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసినట్లు దాఖలాలు లేవు. జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో మాట్లాడుతున్నారే కానీ, ఇక్కడి పేదల సమస్యలపై ఒక్క రోజు కూడా చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు అనేకం ఉన్నాయి.
సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నకేంద్ర మంత్రి మేనకాగాంధీ.. గత నెల 13న తన నియోజకవర్గంలో పర్యటించారు. ఒక ప్రధాన దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటుచేయడంతోపాటు వంద పడకల కొవిడ్ కేంద్రాన్ని నెలకొల్పారు. అంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదని స్థానికులు వాపోతున్నారు.
కాగా, ఈమె కుమారుడు వరుణ్గాంధీ ఫిల్బిత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుణ్ గాంధీ గత మూడు వారాల్లో మూడుసార్లు పర్యటించారు. ఎక్కువ సమయం కేటాయిస్తున్నప్పటికీ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఇక్కడి వారంటున్నారు.
ఆజాంగఢ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అఖిలేష్ యాదవ్.. గత డిసెంబర్ 13 న ఇక్కడ పర్యటించారు. తన నియోజకవర్గంలో మినీ పీజీఐ ఏర్పాటు కోసం తన ఎంపీ నిధి నుంచి కోటి రూపాయలు కేటాయించారు. అప్పటి నుంచి అక్కడ ఏంజరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాగా, జైలులో ఉన్న ఇద్దరు ఎంపీలు ఆజాం ఖాన్ , అతుల్ రాయ్లు అక్కడి నుంచి అధికారులతో మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఏంజరుగుతుందో వీరికి పూర్తిగా తెలిసే అవకాశం లేకపోయింది. ఆజాం ఖాన్ చివరిసారిగా రాయ్పూర్ నియోజకవర్గానికి గత ఏడాది ఫిబ్రవరిలో వెళ్లగా.. మరో ఎంపీ అతుల్ రాయ్ 2019 నుంచి జైళ్లోనే ఉన్నారు.
ప్రతిపక్షాలకు చెందిన ఇద్దరు సహా మొత్తం 16 మంది ఎంపీలు కరోనా వైరస్కు గురయ్యారు. వీరిలో చాలామంది కోలుకొని ఇండ్లకు చేరుకున్నారు. కొందరు అప్పుడప్పుడు తమ నియోజకవర్గాల్లో తిరుగుతుందగా.. మరికొందరు ఇళ్లకే పరిమతమయ్యారు. పలువురు ఎంపీలు తమ నియోజకవర్గాలకు రాకపోవడంతో స్థానికులు కనిపించడం లేదు అనే పోస్టర్లు వేశారు. ఐదుగురు ఎంపీలు కనిపించడం లేదంటూ పోస్టర్లు వెలిశాయి.
సువేందు అధికారి తండ్రి, సోదరుడికి వై ప్లస్ భద్రత
సంగీత దర్శకుడు రామ్లక్ష్మణ్ కన్నుమూత
వ్యాక్సిన్ల కొరత ప్రభుత్వ అలక్ష్యం వల్లే: ఎస్ఐఐ ఈడీ సురేశ్ జాదవ్
ఎగిరే యంత్రానికి రైట్ బ్రదర్స్కు పేటెంట్.. చరిత్రలో ఈరోజు
జీ-7 ఆరోగ్య మంత్రుల సమావేశానికి భారత్కు ఆహ్వానం
బ్లాక్ ఫంగస్ తర్వాత.. ఇప్పుడు వైట్ ఫంగస్ ఇబ్బందులు
అంటార్కిటికాలో అతిపెద్ద మంచుకొండ గుర్తింపు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..