న్యూఢిల్లీ, జూన్ 2: గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరిచిన ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి. విదేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ నెలకొనడంతో గత నెలలో ఏకంగా 67 శాతం వృద్ధిని సాధించాయి. 32.21 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇంజినీరింగ్, పెట్రోలియం, జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ అత్యధికంగా ఎగుమతి అయినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో 19.24 బిలియన్ డాలర్ల ఎగుమతి జరిగింది. ఇదే నెలలో 38.53 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకున్నది. దీంతో వాణిజ్యలోటు 6.32 బిలియన్ డాలర్లుగా ఉన్నది.
గత నెలలో 9.45 బిలియన్ డాలర్ల విలువైన చమురు దిగుమతి అయింది. మే 2020 నెలలో అయిన 3.57 బిలియన్ డాలర్లతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది.
ఏప్రిల్-మే రెండు నెలల్లో ఎగుమతులు 62.84 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో 84.25 బిలియన్ డాలర్లు దిగుమతులు జరిగాయి.