న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం (2021)లో భారత్ జీడీపీ వ్రుద్ధిరేటు 12 శాతానికి చేరుకోవచ్చునని ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్స్ సంస్థ మూడీస్ అంచనా వేసింది. జీడీపీని పరుగులు పెట్టించేందుకు, ప్రజల చేతిలో డబ్బు చలామణి పెరిగేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మరోదఫా వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ప్రస్తుతం వడ్డీరేట్లు నాలుగు శాతంగా కొనసాగుతున్నది. దేశీయంగా వినియోగాన్ని బట్టి రెండో అర్ధభాగంలో కొంత అదనపు ద్రవ్య మద్దతు కూడగట్టాల్సిన అవసరం రావచ్చునని మూడీస్ అభిప్రాయపడింది.
సమీప భవిష్యత్ పరిణామాలు సానుకూలంగా ఉన్నందున గతేడాది 7.1 శాతానికి కుదించుకుపోయింది. అయినా అంచనాలకు భిన్నంగా డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ 0.4 శాతానికి పెరగడం సానుకూల పరిణామాలకు సంకేతం అని మూడీస్ వ్యాఖ్యానించింది. కొన్ని నెలలుగా లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేయడంతోపాటు ఉత్పాదక కార్యకలాపాలను పునరుద్ధరించడం సానుకూల పరిణామాలుగా మారాయని పేర్కొంది.
రాబోయే కొన్ని త్రైమాసికాల్లో ప్రైవేట్ వినియోగం పెరుగడంతోపాటు నాన్ రెసిడెన్షియల్ పెట్టుబడులు ఊపందుకుని 2021లోనే దేశీయ డిమాండ్ బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నట్లు మూడీస్ తెలిపింది. అయితే, ద్రవ్యలోటు వల్ల ఆహార ధరలు, ఇంధన ధరలు పెరిగిపోయే అవకాశం ఉందని, అదే జరిగితే ప్రతి కుటుంబ ఖర్చు మరింత పెరుగుతుందని పేర్కొంది.