ఖమ్మం కల్చరల్/ కొత్తగూడెం కల్చరల్, మార్చి 29: రంగుల పండుగ హోలీని సోమవారం రెండో రోజూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఫాల్గుణ మాసం పౌర్ణమి ఆదివారం రంగేలిని జరుపుకున్న ప్రజలు రెండో రోజు పాఢ్యమి రోజున కొన్ని వర్గాల ప్రజలు ఈ పండుగను జరుపుకున్నారు. ప్రభుత్వం విధించిన బహిరంగ ఉత్సవాల నిషేధాజ్ఞలను అమలుచేస్తూ ప్రజలు సమూహంగా తిరుగకుండా హోలీని జరుపుకున్నారు. ప్రభుత్వ సెలవు దినం కూడా కావడంతో అధిక సంఖ్యలో ప్రజలు రంగులను చల్లుకుని ఆనందాన్ని పంచుకున్నారు. జిల్లా కేంద్రంలో మార్వాడీలు ఈ పండుగను తమదైన సంప్రదాయంతో నృత్యాలు, కోలాటాల ప్రదర్శనలతో రంగులను చల్లుకుని సంబురాలు చేసుకున్నారు. ప్రధానంగా చిన్నారులు, యువత రంగులు పూసుకుని ఆనందించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాడవాడలా రంగుల మయం కావడంతో వసంతానికి స్వాగతం పలికినట్లయింది. హోలికా పూర్ణిమ, వసంతోత్సవం, కామ పున్నమిగా పిలువబడే హోలి పండుగ తమ జీవితాల్లో సప్తవర్ణ వెలుగులు నింపుతుందని ప్రజలు సంబురాలు చేసుకున్నారు. అధికంగా యువత తమ ఇండ్ల సమీపంలోని బంధువులు, స్నేహితులకు రంగులు పులిమి కేరింతలు కొట్టారు. ఖమ్మం, భద్రాద్రి జడ్పీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కోరం కనకయ్య సోమవారం హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో కమల్రాజు, టేకులపల్లి మండలంలో కనకయ్య తమ కుటుంబ సభ్యులు, ఆఫీసు సిబ్బందితో కలిసి రంగులు చల్లుకున్నారు.