ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 26: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా దక్షిణ భారత సాహితీ సాంస్కృతిక సమాఖ్య, చినుకు కల్చరల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని ప్రొఫెసర్ జి. రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెమినార్ హాల్లో శనివారం ‘శత కవి కవనం’ నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాది ఆధిపత్యానికి వ్యతిరేకంగా దక్షిణాది కవులు, కళాకారులు ఏకం కావాలని విజ్ఞప్తి చేశారు. చినుకు కల్చరల్ సొసైటీ చైర్మన్ డాక్టర్ విజయ్కుమార్ మాట్లాడుతూ సంపాదించగలిగినంత సంపాదించి, మిగింది పేదలకు పంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన కార్యదర్శి పీఎన్ మూర్తి మాట్లాడుతూ కళలు కలల కోసం కాదని, అవి ప్రజా హితం కోసమన్నారు. ప్రముఖ సాహితీవేత్తలు రామ్ కత్తి, డాక్టర్ ఎర్రం పూర్ణ శాంతిగుప్తా, మనిమంజరి పాల్గొన్నారు.