పెండ్లి చేసుకుంటే భార్యలు వదిలేసి వెళ్లిపోతున్నారు. కాని పిల్లల్ని పెంచుకోవాలని ఆశ ఉన్నది. దీంతో చేసేది లేక డివైడర్పై కూర్చున్న ఓ బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఈ సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. దాదాపు 30 గంటలు శ్రమించిన పోలీసులు సీసీ కెమెరాల సహకారంతో కిడ్నాప్ అయిన బాలుడిని తీసుకువచ్చి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పజెప్పారు.
రాచకొండ ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయంలో పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం… నారాయణపేట్ జిల్లాకు చెందిన జి.శ్రీను, మంజూల భార్యాభర్తలు. వారికి సోను(3), అభిలాష్(2) సంతానం. 6వ తేదీన మధ్యాహ్నం మంజూల అభిలాష్ను తీసుకుని కొత్తపేట ప్రాంతంలో భిక్షాటన చేస్తుంది. మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన మంజూల తన కుమారుడు అభిలాష్ను డివైడర్ మీద కూర్చోబెట్టి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి బాబు కనిపించలేదు. వెంటనే భర్తతో కలిసి సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులకు సమాచారం అందించిన సరూర్నగర్ పోలీసులు అభిలాష్ కిడ్నాప్నకు గురైన ప్రాంతానికి వెళ్లి సీసీ కెమెరాలను పరిశీలించారు. సరూర్నగర్ పోలీసులు, ఎస్ఓటీ, ఐటీ బృందాలు రం గంలోకి దిగి గాలింపును ముమ్మరం చేశాయి.
దర్యాప్తులో భాగంగా రాచకొండ పోలీసులు ఎల్బీనగర్, కొత్తపేట, సరూర్నగర్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. అక్కడ ఓ కెమెరాలో 45 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి బాబును తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. అలా కెమెరాలను మ్యాపింగ్ చేస్తే అనుమానితుడు విజయవాడ బస్ స్టాండ్ నుంచి బస్సు ఎక్కి చౌటుప్పల్లో దిగాడు. అక్కడ ఓ ఆటో ఎక్కి సర్వేకల్ గ్రామంలో దిగాడు. అక్కడ మరో ఆటో ఎక్కి సంస్థాన్ నారాయణ్పూర్ మర్రిగూడ మండలం, అంతంపేట గ్రామానికి వెళ్లినట్లు నిర్దారించుకున్న పోలీసులు నేరుగా అతడి ఇంటికి వెళ్లారు. అక్కడ బాలుడు సురక్షితంగా ఉన్నాడు.
కిడ్నాప్ చేసిన వ్యక్తిని విచారించగా అతడిపేరు మనుపట్టి ముత్తయ్య అని తెలిపాడు. ప్రతిరోజు సరూర్నగర్కు వచ్చి అక్కడ కూలీపని చేసుకుని తిరిగి అంతంపేటకు వెళ్తుంటానని వివరించాడు. అయితే తాను రెండు పెండ్లీలు చేసుకుంటే వారు వదిలిపెట్టి వెళ్లిపోయారని తెలిపాడు. బాలుడిని పెంచుకుందామని కిడ్నాప్ చేసి తీసుకువచ్చినట్లు పోలీసులతో పేర్కొన్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అభిలాష్ను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్, ఏసీపీ శ్రీధర్రెడ్డి, సరూర్నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం తదితరులు పాల్గొన్నారు.