హైదరాబాద్, జూలై 24: భారత్ ఫార్మా పరిశ్రమ 2030వ సంవత్సరానికల్లా 130 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.9.7 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా వేస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ చైర్మన్ కే సతీష్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం దేశీయ ఫార్మా పరిశ్రమ అమ్మకాలు 42 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయని, అందులో సగం దేశీయ అమ్మకాలవగా, మిగిలిన సగం ఎగుమతుల ద్వారా వస్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే దశాబ్దకాలంలో ఇవి మూడు రెట్లు పెరుగుతాయని తాము అంచనా వేస్తున్నట్లు తెలిపారు. శనివారం వర్చువల్గా జరిగిన నైపర్ హైదరాబాద్ సంస్థ 9వ స్నాతకోత్సవంలో సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ విధానం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పరిశోధనలకు ఇస్తున్న ప్రాధాన్యతలతో పరిశ్రమ వృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ప్రాణాధార ఔషధాల సరఫరాకు భారత్ ఫార్మాపరిశ్రమ నిరంతరాయంగా పనిచేసిందన్నారు.