జగిత్యాల/ పెద్దపల్లి/ రాజన్న సిరిసిల్ల (నమస్తే తెలంగాణ)/ కార్పొరేషన్, జూలై 7: పల్లె, పట్టణ ప్రగతి ఉత్సాహంగా సాగుతున్నది. పచ్చదనం.. పరిశుభ్రత పనులు జోరుగా సాగుతున్నాయి. బుధవారం ఏడో రోజు ఊరూరా, వాడవాడనా మురుగు కాలువలు శుభ్రం చేయడం, మొక్కలు నాటే పనులు ప్రణాళికాబద్ధంగా జరిగాయి. ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి, కటికనపల్లి గ్రామాల్లో కలెక్టర్ సంగీత సత్యనారాయణతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ హరిత హారంలో భాగంగా మొక్కలు నాటారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 150 కోట్లకు పైగా మొక్కలు నాటామని మంత్రి ఈశ్వర్ తెలిపారు.
పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. పాలకుర్తి మండలం కన్నాలలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పాల్గొన్నారు. పలుచోట్ల మురుగు కాలువలు శుభ్రం చేయించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పల్లె ప్రగతిపై ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి సమీక్ష నిర్వహించి, దిశానిర్ధాశం చేశారు. ఇక కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పాల్గొన్నారు. వీణవంక మండలం దేశాయిపల్లిలో గీతకార్మికులకు గిరిక మొక్కలను ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పంపిణీ చేశారు. గంగాధర మండలం తాడిజెర్రిలో డీఎల్పీవో హరికిషన్ పల్లె ప్రగతి పనులను పరిశీలించారు.
నాటిన మొక్కలను తప్పనిసరిగా సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కరీంనగరంలో మేయర్ వై సునీల్రావు 59, 4, 25 డివిజన్లలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలకు ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు. వార్డు కమిటీ సమావేశంలో పాల్గొని డివిజన్లలో నాటే మొక్కల సంరక్షణ బాధ్యతలను మహిళలు తీసుకోవాలని కోరారు. ఇక జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని, హరితహారం మొక్కలు నాటారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులే కాకుండా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఇటు పల్లె ప్రగతి, అటు హరిత హారం కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఇల్లంతకుంట మండలం వంతడుపు గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కౌటిల్యరెడ్డి, డీపీవో రవీందర్, బోయినిపల్లి మండలంలో జడ్పీ ఈసీవో గౌతంరెడ్డి పాల్గొన్నారు.