న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశీయ డాటా సెంటర్ పరిశ్రమ సామర్థ్యం 2023 నాటికి రెట్టింపు స్థాయికి పెరగవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. 1,000 మెగావాట్లకుపైగా చేరుకోవచ్చని ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఓ తాజా ప్రకటనలో తెలియజేసింది. ఈ ఏడాది జనవరి-జూన్లో ఇండస్ట్రీ కెపాసిటీ 499 మెగావాట్లుగా ఉన్నది. ఈ క్రమంలో 2023 నాటికి 1,008 మెగావాట్లకు చేరవచ్చని చెప్తున్నది. డిజిటలైజేషన్లో చోటుచేసుకున్న గణనీయ వృద్ధి మధ్య డిమాండ్ ఒక్కసారిగా పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పురోగతి, క్లౌడ్ అడాప్షన్, డాటా సెంటర్ ఆపరేటర్ల ప్రతిష్టాత్మక వృద్ధి ప్రణాళికలూ దోహదం చేస్తున్నాయని జేఎల్ఎల్ పేర్కొన్నది. ఈ ఏడాది ప్రథమార్ధానికి (జనవరి-జూన్)గాను ‘భారత డాటా సెంటర్ మార్కెట్ అప్డేట్’ పేరుతో జేఎల్ఎల్ ఓ నివేదికను విడుదల చేసింది.
విదేశీ సంస్థల ఆసక్తి
గత ఆరు నెలలుగా దేశంలోకి విదేశీ డాటా సెంటర్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తిని చూపిస్తున్నాయని, పెరిగిన డిమాండ్కు అనుగుణంగా జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు మదుపరులు సుముఖత వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా జేఎల్ఎల్ ముంబై ఆఫీస్ లీజింగ్ అడ్వైజరీ కో-హెడ్, డాటా సెంటర్ అడ్వైజరీ-ఇండియా అధిపతి రచిత్ మోహన వెల్లడించారు. ముఖ్యంగా బ్యాంకింగ్, ఇతర ఆర్థిక సేవల సంస్థలు తమ డిజిటల్ అవసరాలను అందుకోవడానికి హైబ్రిడ్ ఆప్షన్లను ఎంచుకుంటున్నట్లు వివరించారు.
5జీ ఉత్సాహం
దేశంలో డాటా పరిశ్రమ బలోపేతానికి 5జీ టెలికం సేవలూ కలిసొస్తున్నాయి. అలాగే వీడియో, గేమింగ్ వేదికల క్రేజ్ కూడా సామర్థ్యం పెరుగుదలకు కారణమవుతున్నది. ఇక కరోనా నేపథ్యంలో పెరిగిన డిజిటల్ లావాదేవీలు, చెల్లింపులు పరిశ్రమ ముఖచిత్రాన్నే మార్చేసింది. పెద్ద నోట్ల రద్దు నుంచే దేశంలో డాటా పరిశ్రమకు గట్టి బీజం పడిందని నిపుణులు అంటున్నారు. ఇక హైదరాబాద్లోనూ డాటా సెంటర్లు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే. కాగా, డాటా పరిశ్రమలో మెగావాట్.. ఐటీ డిజైన్ పవర్ లోడ్ను సూచిస్తుంది.