న్యూఢిల్లీ, జూన్ 15: ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ల గుత్తాధిపత్య ధోరణులపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తును వేగవంతం చేయనుంది. ఈ రెండు కంపెనీలు వాటి ఈకామర్స్ ప్లాట్ఫామ్స్పై ఎంపికచేసిన కొంతమంది అమ్మకాదార్లనే ప్రోత్సహిస్తూ, భారీ డిస్కౌంట్లు ఇస్తూ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయంటూ వచ్చిన ఫిర్యాదులపై గతేడాది జనవరిలో సీసీఐ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఆ ఇరు కంపెనీలు కోర్టును ఆశ్రయించి, తాము ఎటువంటి తప్పుడు వ్యాపారాల్ని చేయలేదని, సీసీఐ వద్ద తగిన సాక్ష్యాధారాలు లేవంటూ ఏడాదిపాటు దర్యాప్తును నిలుపుచేయించగలిగాయి. దర్యాప్తు పునర్ప్రారంభానికి గతవారం కోర్టు నుంచి గ్రీన్సిగ్నల్రావడంతో ఆరోపణలకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే అందించాలంటూ అమెజాన్, ఫ్లిప్కార్ట్లను సీసీఐ డిమాండ్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.