Batteries Production | రానున్నది విద్యుత్ వాహనాల యుగం.. విద్యుత్ వాహనాల్లో బ్యాటరీలు కీలకం. దేశీయంగా బ్యాటరీల తయారీకి విదేశీ సంస్థలను ఆహ్వానించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. అందుకోసం టెస్లా ఇంక్, శ్యామ్సంగ్, ఎల్జీ ఎనర్జీ సంస్థలను భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తోంది. దేశీయంగా క్లీన్ ట్రాన్స్పోర్ట్కు సప్లయ్ చైన్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నది.
ఇందుకోసం వచ్చే నెలలో విదేశాల్లో ఐదు రోడ్షోల నిర్వహణకు ప్లాన్లు సిద్ధం చేసింది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జపాన్లలో ఈ రోడ్షోలు నిర్వహిస్తారు. ఆయా దేశాల్లోని బ్యాటరీల తయారీ సంస్థలతో సంప్రదింపులు జరిపి స్థానికంగా ఉత్పాదక యూనిట్లు స్థాపించాలని కోరతారని అధికార వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే టెస్లా, ఎల్జీ ఎనర్జీ, శ్యామ్సంగ్ సంస్థలను సదరు రోడ్షోల్లో పాల్గొనాలని ఆహ్వానించింది. ఆయా సంస్థల డెలిగేట్స్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ లభించలేదు. నార్త్వోల్ట్, పనాసోనిక్, తొషిబా వంటి ఇతర సంస్థలను కూడా ఆహ్వానిస్తున్నది. దేశీయంగా బ్యాటరీల ఉత్పాదక యూనిట్లను స్థాపించే సంస్థలకు 240 కోట్ల డాలర్ల ఇన్సెంటివ్లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే రిలయన్స్, ఆదానీ, టాటా గ్రూప్ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి.