కోల్కతా, మార్చి 13: కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా శనివారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఆయన ఆ పార్టీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. పార్టీలో చేరిన అనంతరం యశ్వంత్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. వాజపేయి హయాంలో ఉన్న బీజేపీకి, ఇప్పుడున్న బీజేపీకి పోలికే లేదన్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఎన్నికల్లో ఎలా అయినా గెలవడమే వారికి ముఖ్యమని, ప్రజల సంక్షేమం అక్కర్లేదని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ గెలుపు 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి సంకేతాలు పంపాలని అన్నారు. యశ్వంత్సిన్హా వాజపేయి హయాంలో కేంద్రమంత్రిగా, బీజేపీలో ముఖ్యనేతగా ఉన్నారు. మోదీ ప్రధాని అయ్యాక పార్టీ నాయకత్వంతో తలెత్తిన విభేదాలతో 2018లో పార్టీ నుంచి బయటకు వచ్చారు.
రెండు దశాబ్దాల కిందట ఎయిరిండియా విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ (కాందహార్ హైజాక్) చేసినప్పుడు ప్రయాణికులను విడిపించేందుకు తాను బందీగా వెళ్లేందుకు మమత సిద్ధపడ్డట్టు యశ్వంత్ సిన్హా వెల్లడించారు. తొలినుంచీ ఆమె పోరాట యోధురాలని కొనియాడారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన ఈ హైజాక్ ఘటన తర్వాత మసూద్ అజర్, ముస్తాక్ అహ్మద్ జార్గర్, ఒమర్ సయీద్ షేక్ను భారత్ విడుదల చేసింది.