India needs 4-5 SBI’s | దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి ఎస్బీఐ వంటి నాలుగైదు పెద్ద బ్యాంకులు అవసరం అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పరోక్షంగా మున్ముందు మరికొన్ని బ్యాంకుల విలీనం జరుగుతుందని సంకేతాలిచ్చారు. ముంబైలో ఆదివారం జరిగిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) 74వ వార్షిక సదస్సులో ఆమె కీలకోపన్యాసం చేస్తూ.. మొత్తం భారత ఆర్థిక వ్యవస్థ విభిన్న మార్గం వైపు మళ్లుతున్నదన్నారు. రూపాంతరం చెందుతున్న బ్యాంకింగ్ వ్యవస్థకు పలు కొత్త సవాళ్లు ఎదురవుతాయని, వాటిని ఎదుర్కొనేందుకు పెద్ద బ్యాంకులు అవసరం ఉందని చెప్పారు.
సుస్థిర భారతీయ బ్యాంకింగ్ పరిశ్రమను సృష్టించడంలో నిరంతరాయ అనుసంధానమైన డిజిటల్ వ్యవస్థలు ముఖ్యపాత్ర పోషిస్తాయని నిర్మలా సీతారామన్ నొక్కి చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలోనూ ప్రజలకు సేవల్లో అంతరాయం కలుగకుండా బ్యాంకుల విలీనాన్ని సజావుగా పూర్తి చేసినందుకు బ్యాంకులను ప్రశంసించారు.
నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్), ఇండియా డెట్ రీసొల్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఐడీఆర్సీఎల్) ఏర్పాటులో కలిసి పని చేసినందుకు ఐబీఏకు మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. వివిధ బ్యాంకుల మొండి బకాయిల పరిష్కారం, పునర్వ్యవస్థీకరణలో ఎన్ఏఆర్సీఎల్, ఐడీఆర్సీఎల్ కలిసి పని చేస్తాయని చెప్పారు. ఎన్ఏఆర్సీఎల్ బ్యాడ్ బ్యాంక్ కాదని అన్నారు.