న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: వచ్చే త్రైమాసికాల్లో భారత్ పటిష్ఠ ఆర్థికాభివృద్ధిని సాధిస్తుందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 9.5 శాతం పెరుగుతుందని, తదుపరి సంవత్సరం 7 శాతం వృద్ధిని కనపరుస్తుందని భావిస్తున్నట్లు బుధవారం ఎస్ అండ్ పీ రేటింగ్స్ డైరెక్టర్ ఆండ్రూ వుడ్ చెప్పారు. భారత్ బలహీన ద్రవ్య పరిస్థితి, అధిక రుణభారం నేపథ్యంలో బలమైన జీడీపీ వృద్ధి సాధన అత్యవసరమని ఆయన వివరించారు.లేకపోతే దేశ ద్రవ్య పరిస్థితి మరింత దిగజారుతుందని ఆయన హెచ్చరించారు. వచ్చే రెండేళ్లలో ద్రవ్యలోటు ఎక్కువగానే ఉంటుందని, ప్రస్తుతం జీడీపీలో 90 శాతంగా ఉన్న రుణభారం మరింత పెరగబోదని అంచనావేస్తున్నట్లు ఆండ్రూ వుడ్ తెలిపారు. కొవిడ్ కాలంలో ఇండియా రికార్డుస్థాయిలో విదేశీ మారక నిల్వల్ని జమచేసిందని, దీంతో దేశపు అంతర్జాతీయ వాణిజ్యపరంగా పటిష్ఠపడిందని ఆయన అన్నారు. ద్రవ్య పరిస్థితి బలహీనంగా ఉన్నా, భారత్ సార్వభౌమ రేటింగ్కు విదేశీ మారక నిల్వలతో మద్దతు లభిస్తున్నదని ఆయన వివరించారు.
గరిష్ఠస్థాయిలోనే ద్రవ్యోల్బణం..
రిజర్వుబ్యాంక్ నిర్దేశించుకున్న 4-6 శాతం శ్రేణిలో ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతుందని ఎస్ అండ్ పీ ఎకానమిస్ట్ (ఆసియా పసిఫిక్) విశ్రుత్ రాణా చెప్పారు. ఈ కారణంగా ఆర్బీఐ ద్రవ్య విధానం మరింత సరళతరం అయ్యే అవకాశం లేదని ఆయన అన్నారు. ఇంధన ధరలు అధికంగానే ఉంటాయని, ఈ సీజన్లో వర్షపాతం సగటుకంటే తక్కువగా ఉన్నందున ఆహార ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉందని రాణా చెప్పారు.