సీఎండీ, సీఈవో పదవులను త్వరగా విభజించాలి లిస్టెడ్ కంపెనీలకు సెబీ స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: చైర్మన్ లేదా చైర్పర్సన్, ఎండీ, సీఈవో పదవులను త్వరగా విభజించాలని స్టాక్ మార్కెట్ నమోదిత సంస్థలకు రెగ్యులేటర్ సెబీ సూచించింది. సీఎండీ, ఎండీ-సీఈవో పదవుల విభజనకు వచ్చే ఏడాది మార్చి 31 చివరి గడువని మంగళవారం గుర్తుచేసింది. కార్పొరేట్ గవర్నెన్స్పై వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెబీ చైర్మన్ అజయ్ త్యాగీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంస్థ ప్రమోటర్ల స్థానాన్ని బలహీనపర్చడమే పదవుల విభజన వెనుక ఉన్న అసలు ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. కార్పొరేట్ గవర్నెన్స్ను మెరుగు పర్చడానికి మాత్రమేనని వెల్లడించారు. మార్కెట్ విలువ ప్రకారం టాప్-500 సంస్థల్లో సీఎండీ, సీఈవో పదవులు వేర్వేరు వ్యక్తుల చేతుల్లోనే ఉండాలంటూ ఏప్రిల్ 1, 2022ను గడువుగా సెబీ విధించింది. నిజానికి గతేడాది ఏప్రిల్ 1 నుంచే ఈ నిబంధన అమల్లోకి రావాలి. కానీ పరిశ్రమ విజ్ఞప్తుల మధ్య రెండేండ్లు పొడిగించారు. కాగా, నిరుడు డిసెంబర్ నాటికి 53 శాతం కంపెనీలే ఈ నిబంధనను ఆచరణలో పెట్టాయని త్యాగీ ఈ సందర్భంగా తెలియజేశారు. చాలా కంపెనీల్లో సీఎండీ, లేదా ఎండీ, సీఈవో పదవులు కలిసిపోయి ఉంటున్నాయి. ఈ పదవుల్లో ఒక్కరే ఉంటున్నారు. అయితే దీనివల్ల పారదర్శకత లోపిస్తున్నదని సెబీ అంటున్నది. ఇదిలావుంటే బ్యాంకులు, బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్స్ వంటి సంస్థాగత మదుపరులు తమ క్లెయింట్లు, లబ్ధిదారులకు జవాబుదారీగా ఉండేలా పారదర్శక స్టేవర్డ్షిప్ కోడ్ను అనుసరించాలని సెబీ ఆదేశించింది.