న్యూఢిల్లీ, మార్చి 16: దేశంలో కొత్త మధ్య తరగతి వర్గం బయటకొచ్చింది. మంగళవారం విడుదలైన హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2020 ప్రకారం ఈ ‘న్యూ మిడిల్ క్లాస్’లో 6 లక్షల 33 వేల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇన్నాళ్లూ పేద, మధ్య తరగతి, ధనిక వర్గాలుగా ఉన్న భారతీయ సంపద ముఖచిత్రంలో ఇప్పుడు కొత్త మధ్య తరగతి ఆవిర్భవించినైట్లెంది. ఇక వీరి వార్షిక సగటు పొదుపు రూ.20 లక్షలుగా ఉండగా.. నివాస గృహాలు, వాహనాలు వంటి స్థిరచరాస్తులను కొనేందుకు అమితాసక్తిని కనబరుస్తున్నట్లు హురున్ తెలిపింది.
5.64 కోట్ల మధ్యతరగతి కుటుంబాలు
దేశంలో దాదాపు 5 కోట్ల 64 లక్షల మధ్యతరగతి కుటుంబాలున్నట్లు హురున్ వెల్లడించింది. వీరి వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలకుపైగా, నికర సంపద రూ.7 కోట్లకు దిగువన ఉందని తెలియజేసింది. అలాగే గతేడాది దేశంలో 4.12 లక్షల డాలర్ మిలియనీర్ కుటుంబాలున్నాయని, వీరి సంపద కనీసం రూ.7 కోట్లకు తగ్గకుండా ఉందని వివరించింది. ఇక వెయ్యి కోట్ల రూపాయల సంపద ఉన్న కుటుంబాలు 3వేలున్నాయని హురున్ వెల్లడించింది. దేశంలో ఎక్కువమంది ఫిక్స్డ్ డిపాజిట్లు, రియల్టీ, స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేలింది.
కరోనాతో ఆనందం ఆవిరి
కరోనా వైరస్ నేపథ్యంలో తాజా సర్వే.. దేశీయ సంపన్నులలో సంతోషం తగ్గిపోయినట్లు చెప్పడం గమనార్హం. గతంతో పోల్చితే నిరుడు ఆనందపు సూచీ 13 శాతం క్షీణించిందని ఈ సందర్భంగా హురున్ తెలిపింది. 10 పాయింట్లకు 7.23 పాయింట్లకే పరిమితమైనట్లు పేర్కొన్నది. 2019లో 8.5 పాయింట్లుగా ఉన్నట్లు గుర్తుచేసింది. కొవిడ్-19 దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైన విషయం తెలిసిందే.
భారతీయ మిలియనీర్ల ఇష్టాలు
లగ్జరీ కార్లు: మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ, జాగ్వార్
మద్యం: జానీ వాకర్ బ్లూ లేబుల్, డామ్ పెరిగ్నన్ షాంపెయిన్
బ్యాంకులు: హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్
జీవిత బీమా: ఎల్ఐసీ
ఎయిర్లైన్స్: ఎమిరేట్స్, సింగపూర్, ఎతిహాద్
పెట్టుబడులకు: సింగపూర్, యూఏఈఆతిథ్యం: తాజ్ హోటల్, మారియట్
ధరించే బ్రాండ్స్: రోలెక్స్ వాచ్, తనిష్క్ జ్యుయెల్లరీ
దేశవ్యాప్తంగా 449 మంది డాలర్ మిలియనీర్ల (ఇందులో 62 మంది రూపీ బిలియనీర్లున్నారు) అభిప్రాయాలతో ఈ సర్వే జరిగింది.
హురున్ ఇండియా నివేదిక ముఖ్యాంశాలు
మహారాష్ట్రలో అత్యధికంగా 56వేల మిలియనీర్ కుటుంబాలు
ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, గుజరాత్
18వేల కుటుంబాలతో తెలంగాణకు 9వ స్థానం
దేశీయ మిలియనీర్లలో 46 శాతం మంది టాప్-5 రాష్ర్టాల్లోనే
టాప్-5 సిటీల్లో ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, చెన్నై
ముంబైలోని 16,933 మిలియనీర్ కుటుంబాల సంపద.. దేశ జీడీపీలో 6.16 శాతానికి సమానం
దేశ జీడీపీలో 4.94 శాతంగా ఢిల్లీలోని 16వేల మిలియనీర్ కుటుంబాల సంపద విలువ
రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు మిలియనీర్ల అమితాసక్తి