వాషింగ్టన్: ప్రపంచంలో తొలి శిశువు కరోనా యాంటీబాడీలతో జన్మించింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 36 వారాల గర్భిణీ మోడరనా కరోనా టీకా తొలి డోసు తీసుకున్నారు. మూడు వారాల తర్వాత ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఆ శిశువు బొడ్డు తాడు నుండి రక్తం సేకరించి పరీక్షించిన ఇద్దరు వైద్యులు అందులో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు. నవజాత శిశువు బొడ్డుతాడులో కరోనా టీకా ప్రతిరోధకాలు ఉన్నాయని వారు తెలిపారు. ప్రపంచంలో కరోనా యాంటీబాడీలున్న తొలి బిడ్డ ఈ శివువే కావచ్చని చెప్పారు. బిడ్డకు పాలు ఇస్తున్న ఆ మహిళ 28 రోజుల తర్వాత కరోనా టీకా రెండో డోసు వేయించుకున్నారని వెల్లడించారు.
కరోనా ప్రతిరోధకాలతో జన్మించిన నవజాత శిశువుల్లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువని ఆ వైద్యులు తెలిపారు. తల్లి టీకా వల్ల నవజాత శిశువులో యాంటీబాడీస్ ఉత్పత్తి అయిన నేపథ్యంలో కరోనా సోకడం లేదా ఇతర అనారోగ్య సమస్యల ముప్పు చాలా తక్కువని తెలిపారు. అయితే గర్భిణీలకు కరోనా టీకా ఇవ్వడం వల్ల తలెత్తె ప్రమాదాలు, టీకా సామర్థ్యం వంటి వాటిని అధ్యయనం చేసేందుకు మరింత పరిశోధన అవసరమని ఆ వైద్యులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.