ఆర్థిక వ్యవస్థపై కరోనా సెకండ్వేవ్పట్ల ఫిచ్ రేటింగ్స్ అంచనా
న్యూఢిల్లీ, మే 10: భారత ఆర్థిక వ్యవస్థపై ప్రస్తుత రెండో దశ కొవిడ్ ప్రభావం&2020 సంవత్సరంకంటే తక్కువేనని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అయితే ఈ ఏప్రిల్- మే నెలల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగించినందున, ఆర్థిక వ్యవస్థ ఆలస్యంగా కోలుకోవొచ్చునని ఫిచ్ అంచనావేసింది. గత ఏడాదికంటే తాజాగా కొవిడ్ కేసులు, మరణాలు అధికంగా నమోదవుతున్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం గత ఏడాదితో పోలిస్తే తక్కువగానే వుండవచ్చని, వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంటే, ఫైనాన్షియల్ రంగానికి మద్దతుగా రిజర్వుబ్యాంక్ మరిన్ని చర్యలు తీసుకోవొచ్చని భావిస్తున్నట్లు ఫిచ్ విడుదల చేసిన నివేదికలో వివరించింది. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగాలు లాక్డౌన్లను కఠినంగా అమలుచేయడం లేదని, కంపెనీలు, ప్రజల్లో ఈ జీవతానికి తగిన మార్పు వచ్చిందని, అందువల్ల ప్రభావం తక్కువ వుండవచ్చని పేర్కొంది. ప్రస్తుత కొవిడ్ దశ చల్లారినా, దేశంలో వాక్సినేషన్ కార్యక్రమం నత్తనడక కారణంగా మరోసారి కొవిడ్ మహమ్మారి విజృంభించే అవకాశం వుందని ఫిచ్ హెచ్చరించింది.
అలాగే కొవిడ్ కేసులు మరింతగా పెరిగినా, మరిన్ని రాష్ర్టాల్లో లేదా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినా రిస్క్ పెరుగుతుందని పేర్కొంది. వ్యక్తిగత రుణగ్రహీతలకు, చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఊరటనిస్తూ మే 5న ఆర్బీఐ ప్రకటించిన చర్యల వల్ల ఒనగూడే ఫలితం పెద్దగా వుండదని, గత ఏడాది లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా కోలుకుంటున్న సమయంలో మళ్లీ తలెత్తిన కొవిడ్ సంక్షోభం చిన్న వ్యాపారాలను మరింత దెబ్బతీస్తుందని, వ్యక్తిగత ఆదాయ వర్గాలపై వైద్య బిల్లుల భారం పడుతుందని, ఈ నేపథ్యంలో కేంద్ర బ్యాంకు నుంచి మరో ప్యాకేజిని ఫిచ్ అంచనావేస్తోంది. క్రెడిట్ గ్యారంటీ స్కీములు, గత ఏడాది మార్చి-ఆగస్టు మధ్య మంజూరుచేసిన తరహాలో రుణాల చెల్లింపుపై పూర్తి మారిటోరియం వంటి చర్యల్ని ఆర్బీఐ ప్రకటించే అవకాశం వుందని రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది.