న్యూఢిల్లీ, జూలై 24: ఇండియాలో సంపద సృష్టి అట్టడుగు భాగం నుంచి జరిగేలా అభివృద్ధి పంథాను అనుసరిస్తే 2047 కల్లా అమెరికా, చైనాలతో సమాన ధనిక దేశంగా భారత్ ఎదుగుతుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ వ్యాఖ్యానించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మూడు దశాబ్దాలు గడిచిన సందర్భంగా రాసిన ఒక వ్యాసంలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. 1991లో కొరతలతో సతమవుతున్న భారత ఆర్థిక వ్యవస్థ.. 2021కల్లా మిగులు ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని, జీడీపీ 266 బిలియన్ డాలర్ల నుంచి 10 రెట్లు పెరిగిందంటూ దేశంలో అత్యంత శ్రీమంతుడైన ముకేశ్ వివరించారు. ఆర్థిక వ్యవస్థ దిశను 1991 మార్చిందని, లైసెన్స్ కోటా రాజ్కు ముగింపు పలికిందని, వ్యాపార, పారిశ్రామిక విధానాల్ని సరళతరం చేసిందని ముకేశ్ తన వ్యాసంలో రాసుకొచ్చారు. ఈ సంస్కరణలు భారత్ను ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవింపచేశాయని, జనాభా 88 కోట్ల నుంచి 138 కోట్లకు పెరిగినప్పటికీ, పేదరికం శాతం సగానికి తగ్గిందని పేర్కొన్నారు. ఇప్పటివరకూ మనం సాధించినవాటి ద్వారా మరింత పెద్ద కలను సాకారం చేసుకునే హక్కు లభించిందని, 2047లో నూరు వసంతాల స్వాతంత్య్ర దినోత్సవానికల్లా మూడు పెద్ద ధనిక దేశాల్లో ఇండియా ఒకటిగా సంబరాలు చేసుకోవడంకన్నా పెద్ద కల ఏమి ఉంటుందని ముకేశ్ అంబానీ అన్నారు.
స్వతంత్ర భారత చరిత్రలో వచ్చే 30 సంవత్సరాలను అత్యుత్తమంగా మలుచుకునే అవకాశం మన ముందు ఉన్నదని, ఇది సాధించాలంటే దేశం స్వయం సమృద్ధి సాధి స్తూ మిగతా ప్రపంచంతో అనుసంధానం కావాలని ముకేశ్ చెప్పారు. చాలాకాలంగా సంపదను వ్యక్తిగతంగానూ, ఆర్థికపరంగానూ చూస్తున్నామని, అందరికీ విద్య, అందరికీ ఆరోగ్యం, ఆందరికీ ఉపాధి, అందరికీ ఇండ్లు, అందరికీ పర్యావరణ రక్షణ.. ఒక్కమాటలో చెప్పాలంటే ‘అందరికీ సంతోషం’ అనేదే నిజమైన సంపద అని, ఈ సంపద సృష్టి అట్టడుగు స్థాయి నుంచి జరగాలని ముకేశ్ ఆకాంక్షించారు.