న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: దేశీయ స్టాక్ మార్కెట్లలోని మదుపరులకు చిన్న షేర్లు.. పెద్ద లాభాల్ని పంచుతున్నాయి. రోజుకో రికార్డుతో రేసు గుర్రంలా పరుగులు తీస్తున్న సూచీలకు చోటా స్టాక్స్ ఇస్తున్న బలం భారీగానే ఉన్నది మరి. ఈ ఆర్థిక సంవత్సరంలో గత నెలాఖరుదాకా బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) స్మాల్క్యాప్ సూచీ 6,270.61 పాయింట్లు లేదా 30.36 శాతం పుంజుకుని 26,919.94 వద్దకు చేరుకున్నది. ఇదే సమయంలో మిడ్క్యాప్ సూచీ 3,672.12 పాయింట్లు లేదా 18.19 శాతం పెరిగి 23,853.43 వద్దే నిలిచింది. ఇక 30 షేర్లున్న బ్లూచిప్ కంపెనీల సూచీ సెన్సెక్స్ గడిచిన ఐదు నెలల్లో 8,043.24 పాయింట్లు లేదా 16.24 శాతం అందిపుచ్చుకున్నది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కదలాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తక్కువ పెట్టుబడితో వీలైనన్ని ఎక్కువ షేర్ల కొనుగోలుపై మదుపరులు దృష్టి పెట్టినట్లు మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
మెరుగైన స్థూల ఆర్థిక పరిస్థితులు, ఎగుమతులు, ఈ-వే బిల్లులు, పన్నుల చెల్లింపులు, ఆటో అమ్మకాలు.. దేశ జీడీపీ అంచనాల్ని మదుపరుల్లో అమాంతం పెంచేశాయని అంటున్నారు. ముఖ్యంగా సంస్థాగతేతర మదుపరులు మార్కెట్ లావాదేవీల్లో పెరిగారని పేర్కొంటున్నారు. గత ఆర్థిక సంవత్సరం బీఎస్ఈ స్మాల్క్యాప్ 11,040.41 పాయింట్లు లేదా 114.89 శాతం పెరిగింది. మిడ్క్యాప్ 9,611.38 పాయింట్లు లేదా 90.93 శాతం పెరిగితే, సెన్సెక్స్ 20,040.66 పాయింట్లు లేదా 68 శాతం ఎగిసింది. ఓ భారీ సంస్థ విలువలో ఐదో వంతుగా ఉన్న సంస్థ మిడ్క్యాప్లో, పదో వంతుగా ఉన్న సంస్థ స్మాల్క్యాప్లో ఉంటుంది.