న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్లో తలెత్తిన అంతర్గత పోరు హస్తినకు చేరింది. వివాదం పరిష్కారం కోసం కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని కలుసుకునేందుకు పంజాబ్ సీఎం అమరీందర్సింగ్ మంగళవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. మల్లికార్జున ఖర్గే సారథ్యంలోని కమిటీని కెప్టెన్ అమరీందర్ కలిశారు. కాగా, ఆరుగురు మంత్రులతో సహా సుమారు డజను మంది రెబల్ నేతలు రాహుల్ గాంధీని కలుసుకోనున్నారు.
పంజాబ్లో పరిస్థితిపై చర్చించేందుకు కెప్టెన్ను ఢిల్లీకి రమ్మని కాంగ్రెస్ ప్యానల్ పిలిచింది. ఇవాళ్టి భేటీతో అమరీందర్ కాంగ్రెస్ ప్యానల్ను కలువడం ఇది రెండోసారి. కాగా, పంజాబ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆదివారం మరోసారి కెప్టెన్పై మాటల దాడి చేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది. సిద్ధూ తన తాజా వ్యాఖ్యల ద్వారా పార్టీ ఆఫర్ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పదవికి సిద్ధంగా లేనట్లు సంకేతాలిచ్చారు.