న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో గత ఏడాది 7.3 శాతం పతనమైన భారత ఆర్ధిక వ్యవస్ధ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 9.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని, 2022లో 8.5 శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది. ఇక చైనా 2021లో 8 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని, 2022లో 5.6 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని స్పష్టం చేసింది.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అంతర్జాతీయ ఆర్ధిక వృద్ధి రేటును 5.9 శాతంగా అంచనా వేసినట్టు ఐఎంఎఫ్ ప్రధాన ఆర్ధికవేత్త గీతా గోపీనాధ్ వెల్లడించారు. 2022లో ప్రపంచ వృద్ధిరేటు అంచనాను యధాతథంగా 4.9 శాతంగా ఉంచామని ఆమె తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ఊపందుకుంటే అంతర్జాతీయ ఆర్ధిక వృద్ధి జోరందుకుంటుందని అన్నారు.ఇక అగ్రదేశం అమెరికా జీడీపీ ఈ ఏడాది ఆరు శాతం వృద్ధి చెందుతుందని, తదుపరి ఏడాది వృద్ధిరేటు 5.2 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.