బెంగళూరు : గత కొద్ది రోజులుగా కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలువుతోంది. మహమ్మారి కట్టడికి కఠిన లాక్డౌన్ విధించాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున కర్ణాటకలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధించాల్సి ఉంటుందన్నారు. రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ‘ప్రజలు నియమాలు పాటించడం లేదు. కర్ణాటకలో పూర్తిస్థాయి లాక్డౌన్కు వెళ్లడం అనివార్యం కావొచ్చు. మేం రెండు రోజుల్లో నిర్ణయిస్తాం’ అని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర తర్వాత కర్ణాటకలోనే రోజువారీ కొవిడ్ కేసులు అత్యధికంగా నమోదవుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కర్ణాటకలో 49,058 కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం 50వేల మార్క్ను దాటాయి. కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆక్సిజన్ డిమాండ్ సైతం పెరిగింది. వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, కొవిడ్ రోగులను సహాయం కోసం తన నివాసం వద్దకు తీసుకురావొద్దని సూచించారు. గురువారం పలువురు కొవిడ్ రోగులను సీఎం ఆఫీసు వద్దకు తీసుకువచ్చి ఆసుపత్రిలో బెడ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ క్రమంలో ఆయన స్పందిస్తూ అధికారులు సహాయం అందిస్తారని, ప్రజల సమస్యలను అర్థం చేసుకున్నానన్నారు. మేం మీతోనే ఉన్నామని.. దయ చేసి రోగులను విధాన సౌధకు, నివాసానికి తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు.